కర్ణాటక ప్రభుత్వం కథ ఖతం: 13 మంది రెబల్ ఎమ్మెల్యేల రాజీనామా ?, రామలింగా రెడ్డి షాక్ !
Recommended Video
బెంగళూరు: కర్ణాటకలోని సంకీర్ణ ప్రభ్వుతం కథ ఖతం ? అంటే అవుననే అంటున్నారు రెబల్ ఎమ్మెల్యేలు. శనివారం మద్యాహ్నం కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలకు చెందిన రెబల్ ఎమ్మెల్యేలు వారి పదవులకు రాజీనామాలు చెయ్యడానికి బెంగళూరులోని విధాన సౌధ చేరుకోవడంతో సంకీర్ణ ప్రభుత్వం హడలిపోయింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ హోం శాఖా మంత్రి రామలింగా రెడ్డి తాను రాజీనామా చేస్తున్నానని విధాన సౌధలో సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజీనామా చెయ్యడానికి సిద్దమైన ఎమ్మెల్యేలలో మాజీ సీఎం సిద్దరామయ్య శిష్యులు ఉన్నారు.
సిద్దరామయ్య శిష్యులు
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యకు అత్యంత సన్నిహిత ఎమ్మెల్యేలు సైతం వారి పదవులకు రాజీనామా చెయ్యడానికి విధాన సౌధకు చేరుకున్నారు. సుమారు 13 మంది రెబల్ ఎమ్మెల్యేలు శనివారం వారి పదవులకు రాజీనామా చేస్తారని కన్నడ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. రెబల్ ఎమ్మెల్యేలలో చాల మంది ఇప్పటికే విధాన సౌధ చేరుకున్నారు.
రెబల్ ఎమ్మెల్యేలు వీరే !
కాంగ్రెస్ పార్టీ మీద మొదటి నుంచి తిరుగుబాటు చేసి ఇప్పటికే రాజీనామా చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే రమేష్ జారకిహోళి, బీసీ పాటిల్, మహేష్ కుమటళ్ళి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే, మాజీ హోం మంత్రి రామలింగా రెడ్డి, సౌమ్య రెడ్డి, ఎస్ఎస్ సుబ్బారెడ్డి, శివరామ్ హెబ్బార్, వీ. నాగేంద్ర, ఎస్ టీ, సోమశేఖర్, బైరతి బసవరాజ్, మునిరత్న, కే. గోపాలయ్య, కె, విశ్వనాథ్, నారాయణగౌడ, ప్రతాప్ గౌడ పాటిల్ శనివారం రాజీనామా చెయ్యడానికి సిద్దం అయ్యారని తెలిసింది.
జయదేవలో స్పీకర్ రమేష్ కుమార్
కర్ణాటక స్పీకర్ రమేష్ కుమార్ బెంగళూరులోని జయదేవ ఆసుపత్రి దగ్గర ప్రత్యక్షం అయ్యారు. రెబల్ ఎమ్మెల్యేలు రాజీనామా చెయ్యడానికి సిద్దం అయ్యారా అని మీడియా స్పీకర్ రమేష్ కుమార్ ను ప్రశ్నించింది. ఈ విషయంపై స్పీకర్ రమేష్ కుమార్ మీడియా మీద విరుచుకుపడ్డారు.
మీరు మనుషులేనా ?
ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తున్నారా అంటే తనకు తెలీదని స్పీకర్ రమేష్ కుమార్ మీడియాకు చెప్పారు. అయితే మీడియా పదేపదే ఆ విషయం గురించి అడగడంతో అసలు మీరు మనుషులేనా అంటూ స్పీకర్ రమేష్ కుమార్ మీడియా ప్రతినిధుల మీద మండిపడ్డారు. జయదేవ ఆసుపత్రి దగ్గర నుంచి స్పీకర్ రమేష్ కుమార్ విసురుగా వెళ్లిపోయారు.
అమెరికా టూ బెంగళూరు
కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వానికి రెబల్ ఎమ్మెల్యేలు చెక్ పెడుతున్నారని సమాచారం తెలుసుకున్న మీడియా విధాన సౌధలో మకాం వేసింది. అమెరికా నుంచి ఇప్పటికే బయలుదేరిన సీఎం కుమారస్వామి బెంగళూరు చేరుకునే ముందే రెబల్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసే అవకాశం ఉంది. మొత్తం మీద శనివారం కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిపోయే అవకాశం ఉందని రాజకీయ నాయకులు అంటున్నారు.