సిద్దూ ఇంటిలో అసమ్మతి ఎమ్మెల్యేలు ప్రత్యక్షం, ఆపరేషన్ కమల, ముంబైలో, అనర్హత వేటు !
బెంగళూరు: కొంత కాలంగా అసమ్మతితో రగిలిపోతూ ముంబైలో మకాం వేసిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సీఎల్ పీ నేత సిద్దరామయ్య ఇంటిలో ప్రత్యక్షం అయ్యారు. శుక్రవారం బెంగళూరులోని మాజీ సీఎం సిద్దరామయ్య ఇంటికి చేరుకున్న కాంగ్రెస్ అసమ్మతి ఎమ్మెల్యేలు ఆయనతో సుధీర్ఘంగా చర్చించారు.
బెంగళూరులోని సిద్దరామయ్య ఇంటికి శుక్రవారం మాజీ మంత్రి, సీనియర్ ఎమ్మెల్యే రమేష్ జారకిహోళి, బళ్లారి గ్రామీణ నియోజక వర్గం ఎమ్మెల్యే నాగేంద్రతో పాటు నలుగురు అసమ్మతి ఎమ్మెల్యేలు చేరుకున్నారు. అసమ్మతి ఎమ్మెల్యేలకు మాజీ మంత్రి రమేష్ జారకిహోళి నాయకత్వం వహించారని జోరుగా ప్రచారం జరిగింది.
కాంగ్రెస్ పార్టీ అసమ్మతి ఎమ్మెల్యేలు ముంబైలో ఉన్నారని, ఆపరేసన్ కమలలో భాగంగా ఎమ్మెల్యేలు బీజేపీతో టచ్ లో ఉన్నారని తెలిసింది. అయితే ఒక్కసారిగా తాము అందరూ ముంబై వెళ్లలేదని, సొంత పనుల మీద వేర్వేరుగా ముంబై వెళ్లామని అసమ్మతి ఎమ్మెల్యేలు అంటున్నారు.
సీఎల్ పీ సమావేశానికి హాజరుకాకుండా పార్టీ నియమాలను ధిక్కరించారని, అసమ్మతి ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకోవాలని మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య స్పీకర్ రమేష్ కుమార్ కు లేఖ ఇచ్చారు. శుక్రవారం మంత్రి జమీర్ అహమ్మద్ తో కలిసి అసమ్మతి ఎమ్మెల్యేలు మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో భేటీ అయ్యి చర్చించారు. ఇప్పుడు ఎమ్మెల్యేల మీ అనర్హత వేటు పడుతుందా ? లేదా ? అంటూ చర్చ మొదలైయ్యింది.