నుదుట విభూది రేఖలతో.. రాహుల్ గాంధీ శివార్చన
బెంగళూరు: పోలింగ్ తేదీ సమీపిస్తోన్న కొద్దీ కర్ణాటకలో అసెంబ్లీ ప్రచారం పతాక స్థాయికి చేరుకుంటోంది. మొత్తం 224 నియోజకవర్గాలకు మే 10వ తేదీన ఒకే విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. అదే నెల 13వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది ఏ పార్టీ అనేది ఆ రోజున తేలిపోతుంది. ఈ ఎన్నికల్లో విజయం సాధించడానికి ప్రధాన పార్టీలన్నీ సర్వశక్తులను ఒడ్డుతున్నాయి.
అధికార భారతీయ జనతా పార్టీ, ప్రతిపక్ష కాంగ్రెస్, జనతాదళ్ (సెక్యులర్).. సుడిగాలి పర్యటనలను నిర్వహిస్తోన్నాయి. వరుసగా రెండోసారి అధికారంలోకి రావడానికి బీజేపీ కసరత్తు చేస్తోన్నప్పటికీ- వరుసగా సీనియర్ నాయకులు రాజీనామా చేస్తోండటం ఆ పార్టీకి మింగుడుపడట్లేదు. మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టార్, మాజీ ఉప ముఖ్యమంత్రి లక్ష్మణ సవాది సహా ఇప్పటికే పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గుడ్బై చెప్పారు.

వారంతా కాంగ్రెస్, జేడీఎస్లల్లో జాయిన్ అయ్యారు. తాజాగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ మాజీ అధినేత రాహుల్ గాంధీ.. కర్ణాటకలో పర్యటిస్తోన్నారు. ఈ ఉదయమే ఆయన కర్ణాటకలో అడుగుపెట్టారు. ఈ ఉదయం ఢిల్లీలో నుంచి ప్రత్యేక విమానంలో ఆయన హుబ్లి విమానాశ్రయానికి చేరుకున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆయన వెంట ఉన్నారు.
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టార్.. హుబ్లీ విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం పలికారు. పార్టీ కండువా కప్పి స్వాగతించారు. అక్కడి నుంచి నేరుగా బాగల్కోటె జిల్లాలోని కూడలసంగమకు చేరుకున్నారు రాహుల్ గాంధీ. సంగమనాథ ఆలయాన్ని సందర్శించారు. ప్రత్యేక పూజలు చేశారు. సుమారు 40 నిమిషాల పాటు ఈ ఆలయ ప్రాంగణంలో గడిపారు.

అనంతరం బాగల్కోటెలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డీకే శివకుమార్, ప్రతిపక్ష నాయకుడు సిద్ధరామయ్య సహా పలువురు సీనియర్ నాయకులు ఇందులో పాల్గొన్నారు. బసవేశ్వరుడి జయంతిని పురస్కరించుకుని ఆయన సిద్ధాంతాలను ప్రస్తావించారు రాహుల్ గాంధీ. శతాబ్దాల కిందటే సమాజంలో నెలకొన్న అసమానతలు, అజ్ఞాన చీకట్లను బసవేశ్వరుడు పారద్రోలాడని పేర్కొన్నారు.
ఇప్పుడాయన సిద్ధాంతాలకు భిన్నంగా కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పరిపాలన సాగించిందంటూ రాహుల్ గాంధీ విమర్శించారు. మూడున్నరేళ్ల పరిపాలనలో బీజేపీ ఈ రాష్ట్రం తిరోగమనం పాలైందని, దీన్ని మళ్లీ పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ సాయంత్రం ఆయన విజయపురలో రోడ్ షోలో పాల్గొననున్నారు. అనంతరం బహిరంగసభలో ప్రసంగిస్తారు.












Click it and Unblock the Notifications