నాకు ఫోన్ చేయకండి, ఇదే పని: బీజేపీ నేతలకు కాంగ్రెస్ ఎమ్మెల్యే దిమ్మతిరిగే షాక్
బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ బలం 105కు చేరుకుంది. స్వతంత్ర ఎమ్మెల్యే శంకర్ బీజేపీకి మద్దతు పలికారు. దీంతో ఆ పార్టీ బలం 105కు చేరుకుంది. కర్నాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన బలం 112. బీజేపీకి మరో ఏడు సీట్లు తక్కువపడుతున్నాయి.
ఇదిలా ఉండగా, బీజేపీకి అత్యధిక సీట్లు వచ్చినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావాల్సిన బలం లేదు. కాంగ్రెస్ - జేడీఎస్లు దొడ్డదారిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాయని ఆరోపిస్తున్న బీజేపీ.. ఆ పార్టీల్లోని అసంతృప్తులను తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తోంది. ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ఆ రెండు పార్టీలు రిసార్ట్ రాజకీయాలకు తెరలేపాయి.

కాంగ్రెస్ ఎమ్మెల్యేకు బీజేపీ ఫోన్
కాగా, బీజేపీకి ఓ కాంగ్రెస్ ఎమ్మెల్యే షాకిచ్చారు. బీజేపీ మిమ్మల్ని కూడా సంప్రదించిందా అని మీడియా అడగగా.. కాంగ్రెస్ ఎమ్మెల్యే టీడీ రాజేగౌడ ఈ విధంగా సమాధానం చెప్పారు. తనకు ఫోన్ చేయవద్దని చెప్పానని, తాను స్వచ్ఛమైన కాంగ్రెస్ కార్యకర్తనని వారుకి చెప్పానని తెలిపారు.

బీజేపీ పదేపదే ఫోన్, వద్దని చెప్పేశా
బీజేపీ తనకు ఫోన్ చేస్తోందని, కానీ దానిని తాను పట్టించుకోవడం లేదని చెప్పారు. నాకు ఫోన్ చేయవద్దని వారికి సూటిగా చెప్పేశానని తెలిపారు. నేను కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి కలిగిన కార్యకర్తను అన్నారు. వారు తనతో చాలాకాలంగా సంప్రదింపులు జరుపుతున్నారన్నారు. వారి పనే ఇది పనే ఇది అని ఎద్దేవా చేశారు.

సుప్రీం కోర్టుకు కాంగ్రెస్
గవర్నర్ కనుక యడ్యూరప్ప నేతృత్వంలోని బీజేపీని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తే సుప్రీం కోర్టుకు వెళ్లే యోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఇప్పటికే ఎనిమిది మంది కాంగ్రెస్, ఇద్దరు జేడీఎస్ ఎమ్మెల్యేలు ఆ పార్టీలకు అందుబాటులో లేరు.

రెండు మూడు రోజుల్లో సందిగ్ధతకు తెర
ఇదిలా ఉండగా, కర్ణాటక రాజకీయ పరిస్థితులపై ఏఐసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీ ఎప్పటికి అప్పుడు సమాచారం సేకరిస్తున్నారని తెలుస్తోంది. గులాం నబీ ఆజాద్తో మాట్లాడుతున్నారని తెలుస్తోంది. కాగా, బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్యను ఏవిధంగా సాధిస్తుందని ఆ పార్టీ నేత బసవరాజ్ బొమ్మైని అడగగా.. రాజకీయ సంధిగ్దత రెండు మూడు రోజుల్లో వీడనుందని చెప్పారు.












Click it and Unblock the Notifications