గవర్నర్ మమ్మల్నే పిలవాలి, కాంగ్రెస్ అడ్డదారి రాజకీయం: యెడ్యూరప్ప
బెంగళూరు: కాంగ్రెస్ పార్టీ అడ్డదారిలో అధికారంలోకి వచ్చేందుకు చేస్తున్న కుట్రలను ఖండిస్తున్నామని బీజేపీ నేత యెడ్యూరప్ప బుధవారం మండిపడ్డారు. కర్నాటక ప్రజల తీర్పుకు కృతజ్ఞతలు అన్నారు. అతిపెద్ద పార్టీకే ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశమివ్వాలని ఆయన వ్యాఖ్యానించారు. నైతికంగా జేడీఎస్ - కాంగ్రెస్ పార్టీలకు పాలించే హక్కు లేదన్నారు.
కర్నాటకలో కాంగ్రెస్-జేడీఎస్ ప్రభుత్వం: రంగంలోకి సోనియా, ఆఫర్కు దేవేగౌడ ఓకే
కన్నడ ప్రజలు మార్పు కోరుతూ తీర్పు ఇచ్చారన్నారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా గవర్నర్ తొలుత మమ్మల్నే పిలవాలని యెడ్యూరప్ప అన్నారు. ప్రజలు తిరస్కరించినప్పటికీ కాంగ్రెస్ పార్టీ అధికారం కోసం పాకులాడుతోందని మండిపడ్డారు. ప్రజలు మార్పు కోరుకున్న విషయం అర్థం చేసుకోవాలన్నారు.
కాంగ్రెస్ పార్టీపై యెడ్డీ నిప్పులు చెరిగారు. కాగా, తొలుత గవర్నర్ను కలుద్దామని భావించిన బీజేపీ ఆ తర్వాత వెనక్కి తగ్గినట్లుగా తెలుస్తోంది. గవర్నర్ను కలవొద్దని భావిస్తోందని సమాచారం. అయితే, పూర్తిగా ఇంకా వ్యూహాన్ని ఖరారు చేసుకోలేదు.
కాగా, కర్ణాటకలో బీజేపీ పునర్వైభవం పొందింది. 2013 ఎన్నికల్లో కేవలం 40 సీట్లు మాత్రమే సాధించి పరాజయం పాలైన బీజేపీ తాజా ఎన్నికల్లో మెజార్టీ సాధించకపోయినా అత్యధిక స్థానాలు సాధించిన పార్టీగా నిలిచింది.
ఈ ఎన్నికల్లో పార్టీ గణనీయ విజయాలను నమోదు చేయడానికి యెడ్యూరప్ప, శ్రీరాములు కారణమని రాజకీయ విశ్లేషకులు తెలిపారు. యెడ్యూరప్ప రాష్ట్రంలోని బలీయమైన లింగాయత్ వర్గానికి చెందినవారు కాగా శ్రీరాములుకు వాల్మీకి వర్గంలో ప్రాబల్యముంది.