నటి రమ్య గతజన్మ నాకు తెలీదు: మాజీ సీఎం
మండ్య/బెంగళూరు: ఆర్ఎస్ఎస్, బీజేపీ భారతదేశానికి స్వాతంత్రం తీసుకురాలేదని వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన మాజీ ఎంపీ, బహుబాష నటి రమ్యపై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి వ్యంగాస్త్రాలు విసిరారు.
ఉద్దరగా వచ్చే ప్రచారం కోసం రమ్య ఆ వ్యాఖ్యలు చేసిందని అన్నారు. భారతదేశానికి స్వాతంత్రం కావాలని తాను పోరాటం చెయ్యలేదని, అప్పటికి నేను పుట్టలేదని మాజీ సీఎం కుమారస్వామి అన్నారు.
మాజీ ఎంపీ రమ్య కూడా అప్పటికి పుట్టలేదని గుర్తు చేశారు. అయితే ముందు జన్మలో రమ్య భారతదేశం కోసం స్వాతంత్రపోరాటం చేసి ఉంటారేమో ? అని ఆయన వ్యంగంగా అన్నారు.
రమ్య గత జన్మలోని మాటలు ఇప్పుడు మాట్లాడి ఉంటుందని చమత్కరించారు. మండ్య జిల్లా ప్రజలు అనేకష్టాలు అనుభవిస్తున్నారని, కావేరి నీటి కోసం పోరాటం చేస్తున్నారని, రమ్య వాటి గురించి పట్టించుకోకుండా ప్రతిపక్షాల మీద ఆరోపణలు చేయ్యడం తగదని హితవుపలికారు.
చరిత్ర, స్వాతంత్ర పోరాటం గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలని, ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం మంచిది కాదని కుమారస్వామి అన్నారు. ఇలాంటి విషయాలు మాట్లాడేటప్పుడు అందరూ జాగ్రత్తగా ఉంటే మంచిదని చెప్పారు.
స్వాతంత్రం కోసం పోరాటం చేసింది ఒక్క కాంగ్రెస్ మాత్రమే అని, బీజేపీ, ఆర్ఎస్ఎస్ స్వాతంత్ర పోరాటం చెయ్యలేదని నటి, మాజీ ఎంపీ రమ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకులు రమ్య మీద మండిపడుతున్నారు.