అక్రమ మైనింగ్: గాలి జనార్దన్ రెడ్డి అరెస్టు
బెంగళూరు: కర్ణాటక పర్యాటక శాఖ మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డిని మళ్లి అరెస్టు చేశారు. శుక్రవారం విచారణ పేరుతో ఎస్ ఐటి అధికారులు గాలి జనార్దన్ రెడ్డిని తమ కార్యాలయానికి పిలిపించుకున్నారు. కొన్ని గంటల పాటు విచారించిన తరువాత మద్యాహ్నాం గాలి జనార్దన్ రెడ్డిని అరెస్టు చేశామని అధికారులు తెలిపారు.
అక్రమ మైనింగ్ చేశారని గాలి జనార్దన్ రెడ్డి మీద అనేక కేసులు నమోదు అయ్యాయి. 13 కేసులలో గాలి జనార్దన్ రెడ్డి ముందస్తు జామీను తీసుకున్నారు. పలు కేసులలో అరెస్టు అయిన జనార్దన్ రెడ్డి దాదాపు రెండున్నరఏళ్లు జైలు శిక్ష అనుభవించి ఇదే సంవత్సరం జనవరిలో జామీను మీద బయటకు వచ్చారు.
అక్రమంగా అనుమతి లేకుండా ఇనుప ఖనిజం విదేశాలకు తరలించారని ఆరోపిస్తూ విచారణకు హాజరుకావాలని ఎస్ఐటి అధికారులు గాలి జనార్దన్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. శుక్రవారం ఉదయం గాలి జనార్దన్ రెడ్డి స్వయంగా ఎస్ఐటి కార్యాలయానికి వెళ్లారు.
విచారణ అనంతరం అధికారులు గాలి జనార్దన్ రెడ్డిని అరెస్టు చేశారు. 2009-2011 మద్య కాలంలో గాలి జనార్దన్ రెడ్డి బినామి కంపెనీల పేరుతో అక్రమంగా ఇనుప ఖనిజం విదేశాలకు తరలించారని ఆరోపణలు రావడంతో ఎస్ ఐటి అధికారులు కేసులు నమోదు చేశారు.
హింద్ ట్రేడర్స్, మధుశ్రీ ఎంటర్ ప్రైజస్ కంపెనీ పేర్లతో విదేశాలకు ఇనుప ఖనిజం తరలించారని అధికారులు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే గాలి జనార్దన్ రెడ్డి అనుచరులు స్వస్తిక్ నాగరాజ్, ఖారంపోడి మహేష్ లను అధికారులు అరెస్టు చేశారు. గాలి జనార్దన్ రెడ్డిని అరెస్టు చెయ్యక ముందు బెంగళూరు, బళ్లారిలోని 14 ప్రాంతాలలో ఎస్ఐటి అధికారులు సోదాలు చేశారు.