బెంగళూరులో 534 పిల్లలకు కరోనా-కర్నాటక అప్రమత్తం-15 మిలియన్ల పిల్లలకు పరీక్షలు
కర్నాటక రాజదాని బెంగళూరులో పిల్లలకు కరోనా సోకడం కలకలం రేపుతోంది. గత కొన్ని రోజులుగా పిల్లలు కరోనా వ్యాప్తితో ఆస్పత్రుల్లో చేరుతుండటం సంచలనం రేపుతోంది. దీంతో పిల్లలకు తక్షణ వైద్య చికిత్స అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు పిల్లల కోసం ప్రత్యేక రోగ నిరోధక కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం అధికారుల్ని ఆదేశించింది.
కర్నాటకలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుతుందని భావిస్తున్న తరుణంలో ఆగస్టు 23 నుంచి ప్రభుత్వం పాఠశాలలు తెరిచేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులోనూ 9 నుంచి 12వ తరగతి వరకూ పిల్లలకు మాత్రమే పాఠశాలలు తెరుస్తున్నారు.
ఇలాంటి సమయంలో బెంగళూరులో వరుసగా పిల్లలకు కరోనా సోకుతున్న కేసులు వెలుగుచూస్తుండటంతో ప్రభుత్వం ఆందోళనలో పడింది. పిల్లల తల్లితండ్రులు కూడా కరోనా వ్యాప్తిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రభుత్వం తక్షణ చర్యలకు దిగింది. ప్రభుత్వ రోగనిరోధక కేంద్రాలు తెరవాలని నిర్ణయం తీసుకుంది.

Recommended Video
ఆగస్టు తొలి పది రోజుల్లోనే బెంగళూరులో 534 మంది పిల్లలకు కరోనా సోకినట్లు ప్రభుత్వం నిర్ధారించింది. ఇందులో 502 మంది పిల్లలకు ఎలాంటి లక్షణాలు కూడా లేకపోవడం విశేషం. కరోనా సోకిన 543 మంది పిల్లల్లో 270 మంది బాలురు, 273 మంది బాలికలు ఉన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా పాజిటివిటీ రేటు కూడా 2 శాతంగానే ఉంది. దీంతో ప్రభుత్వం విద్యార్ధులకు కరోనా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించింది. రాష్టవ్యాప్తంగా మొత్తం 15 మిలియన్ల పిల్లలకు కరోనా పరీక్షలు నిర్వహిస్తామని ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్ తెలిపారు. బెంగళూరు కేసుల నేపథ్యంలో వీరిలో ఎవరికైనా కరోనా సోకిందేమోనన్న అనుమానంతో ఈ పరీక్షలు నిర్వహించబోతున్నారు. మరోవైపు బెంగళూరు మహానగర పాలిక బీబీఎంపీ ఆధ్వర్యంలో పిల్లల కోసం ప్రత్యేక పేడియాట్రిక్ కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. వీటిని ప్రభుత్వం రేపోమాపో ప్రారంభించబోతోంది. కరోనా లక్షణాలు ఉన్న పిల్లలకు ఇక్కడ ప్రత్యేక చికిత్స అందిస్తారు.












Click it and Unblock the Notifications