సుప్రీం కోర్టు: ఊపిరిపీల్చుకున్న జయలలిత
న్యూఢిల్లీ: అక్రమ ఆస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి కుమారి జయలలితకు ఊరట లభించింది. నవంబర్ 23వ తేదికి కేసు వాయిదా పడటంతో జయలలితతో పాటు ఆమె అభిమానులు, పార్టీ నాయకులు ఊపిరి పీల్చుకున్నారు.
అక్రమ ఆస్తుల కేసులో తమిళనాడు ముఖ్యమంత్రి కుమారి జయలలిత నిర్దోషి అంటూ కేసు కొట్టివేస్తూ కర్ణాటక హై కోర్టు తీర్పు చెప్పింది. కర్ణాటక హై కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చెయ్యాలని కర్ణాటక ప్రభుత్వం సుప్రీం కోర్టులో అర్జీ సమర్పించింది.
నాలుగు వేల పేజీల అర్జీని సుప్రీం కోర్టులో సమర్పించారు. సోమవారం సుప్రీం కోర్టులో అర్జీ విచారణ జరిగింది. కర్ణాటక హై కోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చెయ్యాలని కర్ణాటక ప్రభుత్వ తరపు న్యాయవాదులు వాదించారు.
అదే విధంగా క్రింది కోర్టు విధించిన నాలుగు సంవత్సరాల జైలు శిక్ష, రూ. 100 కోట్ల జరిమానా విధించాలని మనవి చేశారు. అయితే కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పు రద్దు చెయ్యడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది. జస్టిస్ పీ.సీ. ఘోష్, జస్టిస్ ఆర్.కే. అగర్వాల్ నేతృత్వంలోని ధర్మాసనం జయలలితకు నోటీసులు జారీ చేశారు.
జయలలిత తదితరులు కౌంటర్ పిటిషన్ వేసిన తరువాత కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును రద్దు చెయ్యాలా వద్దా అనే నిర్ణయం తీసుకుంటామని సుప్రీం కోర్టు చెప్పింది. ఈ సందర్బంలో జయలలిత ఊపిరి పీల్చుకున్నారు.
జైలు నుంచి విడుదల................!
అక్రమ ఆస్తుల కేసులో జయలలిత, ఆమె ప్రాణ స్నేహితురాలు శశికళా నటరాజన్, ఇళవరసి, సుధాకరన్ లకు సీబీఐ ప్రత్యేక కోర్టు జైలు శిక్ష విధించింది. అందరూ జైలుకు వెళ్లారు. అయితే కర్ణాటక హై కోర్టు న్యాయమూర్తి సీ.ఆర్. కుమారస్వామి ఈ శిక్షను రద్దు చేస్తూ 2015 మే 11వ తేదిన తీర్పు చెప్పారు.
మే 23వ తేదిన తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత బాధ్యతలు స్వీకరించారు. తరువాత కర్ణాటక ప్రభుత్వం కర్ణాటక హై కోర్టు ఇచ్చిన తీర్పును ప్రశ్నిస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.