మైనార్టీ విద్యాసంస్థల్లో హిజాబ్ బ్యాన్.. కర్ణాటక సర్కార్ మరో కీలక నిర్ణయం
హిజాబ్ దుమారం అగ్గిరాజేస్తోంది. కర్ణాటకలో గల ఉడిపిలో వివాదం చెలరేగిన సంగతి తెలిసిందే. వివాదంపై కర్నాటక హైకోర్టులో వాడీవేడి వాదనలు సాగుతున్నాయి. ఈ క్రమంలో కర్ణాటక ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడిచే అన్ని స్కూళ్లు, కాలేజీల్లోనూ మతపరమైన వస్త్రధారణపై నిషేధం విధించింది. కాషాయ శాలువాలు, స్కార్ఫ్స్, హిజాబాద్, మతపరమైన జెండాలు తరగతి గదుల్లోకి తీసుకురావొద్దని ఆదేశించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు ఈ నిబంధనలు కచ్చితంగా అమలు కావాల్సిందేనని స్పష్టం చేసింది.
జనవరిలో ఉడుపిలో ప్రభుత్వ కాలేజీలో ఆరుగురు విద్యార్థినిలు హిజాబ్ ధరించి హాజరవగా, వారిని కాలేజీలోకి అనుమతించ లేదు. హిజాబ్ తీసివేస్తేనే లోపలికి అనుమతి ఇస్తామని కాలేజీ యాజమాన్యం స్పష్టంచేసింది. దీనిపై వారు అభ్యంతరం తెలిపారు. హిజాబ్ అనేది తమ సంప్రదాయం అని, హక్కు అని చెప్పారు. ఇంతకాలంగా లేనిది సడెన్గా ఇప్పుడు ఇటువంటి ఆంక్షలు పెట్టటం సరికాదన్నారు. కాలేజీ ముందు ఆందోళన చేశారు. హిందూ విద్యార్థులు కాషాయ కండువాలను ధరించి వచ్చారు. వ్యవహారం దుమారం రేపింది. ఇరు వర్గాల మధ్య ప్రారంభమైన వివాదం రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు విస్తరించింది.
వివాదం ఇతర స్కూళ్లు, కాలేజీలకూ వ్యాపిస్తోంది. మాండ్యలోని రోటరీ స్కూలుకు హిజాబ్ ధరించి వచ్చిన విద్యార్థులను యాజమాన్యం అనుమతించలేదు. కోర్టు ఆదేశాల ప్రకారం హిజాబ్ ధరించి వచ్చిన వారికి ప్రవేశం లేదన్నారు. ఈ అంశంపై కొందరు తల్లిదండ్రులకు, టీచర్లకు మధ్య గొడవ జరిగింది. హిజాబ్ ధరించి తీరతామన్న వారిని వెనక్కి పంపించేశారు. తొలగించిన వారిని స్కూల్లోకి అనుమతించారు.
హిజాబ్ వివాదం ఏపీని కూడా తాకింది. కృష్ణా జిల్లా విజయవాడ లోని ప్రముఖ ఆంధ్రా లయోలా కాలేజీలో బుర్ఖా వేసుకొచ్చిన తమను కాలేజీ యాజమాన్యం అడ్డుకుందంటూ విద్యార్ధినులు ఆరోపించారు. వైరల్ కావడం, ముస్లిం మత పెద్దలు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగారు. ఘటనపై జిల్లా కలెక్టర్ జే నివాస్, విజయవాడ పోలీస్ కమిషన్ పాలరాజు స్పందించారు. కలెక్టర్, సీపీ ఇద్దరూ కాలేజీ ప్రిన్సిపల్ తో నేరుగా మాట్లాడంటంతో వివాదం సద్దుమణిగినట్టు సమాచారం.