కర్నాటకలో సర్కార్ ఎన్నికల హామీలో మార్పు ! 10 కేజీల బియ్యానికి బదులుగా..
కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఉపకరించిన పథకాల్లో ప్రతీ పేద కుటుంబానికి నెలకు 10 కేజీల బియ్యం పథకం కూడా ఒకటి. కాంగ్రెస్ ప్రకటించిన ఐదు గ్యారంటీ హామీల్లో ఒకటైన ఈ పథకాన్ని అమలు చేసే విషయంలో ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పలేదు. తీవ్ర బియ్యం కొరత కారణంగా ఈ పథకంలో మార్పులు చేస్తూ సిద్ధరామయ్య ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ పేదలకు తాము అధికారంలోకి వస్తే నెలకు 10 కేజీల బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తామని చెప్పింది. దీనికి బదులుగా ఇప్పుడు 5 కేజీల బియ్యం మాత్రమే ఇచ్చి, మరో ఐదు కేజీలకు బదులుగా రూ.170 ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు పథకంలో మార్పులు చేస్తూ తీసుకున్న నిర్ణయానికి సిద్ధరామయ్య కేబినెట్ ఇవాళ ఆమోద ముద్ర వేసింది. దీంతో ఇకపై తాజా మార్పులతో ఈ పథకం అమలుకాబోతోంది.

జూలై 1 నుంచి సవరించిన పథకాన్ని అమలు చేస్తామని సిద్ధరామయ్య సర్కార్ ప్రకటించింది. ఇందులో భాగంగా 5 కేజీల బియ్యంతో పాటు నగదు కూడా లబ్దిదారులకు అందజేస్తారు. అయితే తాత్కాలికం మాత్రమేనని వెల్లడించింది. బియ్యం కొరత తీరగానే తిరిగి 10 కేజీల బియ్యం పథకాన్ని అమలు చేస్తామని మంత్రి హెచ్.కె. పాటిల్ క్లారిటీ ఇచ్చారు. వాస్తవానికి కర్నాటకలో ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చేనాటికి బియ్యం కొరత లేదు.
కానీ తాజాగా కేంద్రం అన్నభాగ్య పథకంలో మార్పులు చేసి రాష్ట్రాలకు ఇచ్చే బియ్యంలో కోత విధించింది. ఈ నేపథ్యంలో కర్నాటక ప్రభుత్వం ఏపీతో పాటు తెలంగాణను కూడా బియ్యం కొనుగోలుకు సహకరించాలని కోరింది. కానీ రెండు రాష్ట్రాలు కూడా నిరాకరించడంతో కర్నాటక ప్రభుత్వం మార్పులతో ఈ పథకం అమలు చేసేందుకు సిద్ధమైంది.












Click it and Unblock the Notifications