కాంగ్రెస్ అసమ్మతి ఎమ్మెల్యేలతో స్వతంత్ర పార్టీ ఎమ్మెల్యేలు భేటీ: సీఎం షాక్, ఏం జరుగుతందో!
బెంగళూరు: కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న ఇద్దరు స్వతంత్ర పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ అసమ్మతి నేతలతో భేటీ కావడంతో రాజకీయాలు రసవత్తరంగా మారిపోయాయి. కాంగ్రెస్ పార్టీ అసమ్మతి ఎమ్మెల్యేలు, స్వతంత్ర పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం తీరుపై విసిగిపోయారని సమాచారం.
బెంగళూరులోని సెవన్ మినిస్టర్స్ క్వాటర్స్ లోని గోకాక్ ఎమ్మెల్యే (కాంగ్రెస్) రమేష్ జారకిహోళి ఇంటిలో కాంగ్రెస్ పార్టీ అసమ్మతి ఎమ్మెల్యే మహేష్ కుమటళ్ళి (అథణి), స్వతంత్ర పార్టీ ఎమ్మెల్యేలు హెచ్. మహేష్ (ముళబాగిల్), ఆర్. శంకర్ (రాణేబెన్నూరు) భేటీ అయ్యారు.
రమేష్ జారకిహోళి ఇంటిలో అసమ్మతి ఎమ్మెల్యేల భేటీ కర్ణాటక రాజకీయాలను కుదిపేస్తున్నాయి. కర్ణాటక కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ చార్జ్, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ. వేణుగోపాల్ సైతం బెంగళూరులో అసమ్మతి ఎమ్మెల్యేలతో చర్చలు జరపడానికి రంగం సిద్దం చేశారు.
అయితే కేసీ. వేణుగోపాల్ సమావేశానికి హాజరు కాకముందే స్వతంత్ర పార్టీ ఎమ్మెల్యేలు రమేష్ జారకిహోళితో ఎందుకు భేటీ అయ్యారు అనే చర్చ మొదలైయ్యింది. ముళబాగిల్ ఎమ్మెల్యే మహేష్ మంత్రి డీకే. శివకుమార్ తో భేటీ అయ్యి చర్చలు జరిపారు.
స్వతంత్ర పార్టీ ఎమ్మెల్యేలకు గతంలో మంత్రి పదవులు ఇస్తామని ఇవ్వలేదు. తమకు మంత్రి పదువులు ఇవ్వని సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకోవాలని స్వతంత్ర పార్టీ ఎమ్మెల్యేలు నిర్ణయించారని సమాచారం. తమకు సరైన గౌరవం ఇవ్వని ప్రభుత్వానికి స్వతంత్ర పార్టీ ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించుకునే అవకాశం ఉందని సమాచారం.