Basavaraj Bommai : కర్ణాటక కొత్త సీఎం... ఎవరీ బసవరాజ్ బొమ్మై.. కలిసొచ్చిన అంశాలేంటి?
కర్ణాటక కొత్త ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మైని బీజేపీ శాసనసభా పక్షం ఎన్నుకుంది. దీంతో తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే సస్పెన్స్కు తెరపడింది. కర్ణాటక 22వ ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. బుధవారం(జులై 28) ఆయన ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది.
Recommended Video
బీజేపీ ఎమ్మెల్యేలతో ఆ పార్టీ అధిష్ఠానం పంపించిన ముగ్గురు అబ్జర్వర్లు భేటీ అయి... వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని కొత్త ముఖ్యమంత్రిని ఎంపిక చేశారు. అందరి ఏకాభిప్రాయం మేరకు బసవరాజ్ బొమ్మైని శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. నిజానికి ఈ భేటీకి కొద్ది గంటల ముందు నుంచే హోంమంత్రి బసవరాజ్ బొమ్మైని సీఎం పీఠం వరించబోతున్నట్లు లీకులు వచ్చాయి. అందుకు అనుగుణంగానే కొత్త ముఖ్యమంత్రిగా బసవరాజ్ బొమ్మై వైపే బీజేపీ అధిష్ఠానం మొగ్గుచూపింది.
ప్రస్తుత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి యడియూరప్పకు ఎస్ఆర్ బొమ్మై అత్యంత నమ్మకస్తుడిగా చెబుతారు. పార్టీలో చాలామంది ఎమ్మెల్యేల మద్దతు ఉండటం,లింగాయత్ వర్గానికి చెందిన నేత కావడం ఆయనకు కలిసొచ్చినట్లుగా తెలుస్తోంది. బసవరాజ్ బొమ్మై మాజీ ముఖ్యమంత్రి ఎస్ఆర్ బొమ్మై కుమారుడు. జనతాదళ్ పార్టీతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన బొమ్మై 2008లో బీజేపీలో చేరారు. 1998,2004లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత షిగ్గావ్ నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో జలవనరుల శాఖ మంత్రిగా పనిచేశారు. భారత్లో మొట్టమొదటిసారిగా షిగ్గావ్లో నిర్మించిన 100శాతం పైప్ ఇరిగేషన్ ప్రాజెక్టులో ఆయన కీలక పాత్ర పోషించారు.
వృత్తి రీత్యా మెకానికల్ ఇంజనీర్ అయిన బసవరాజ్ బొమ్మై... కెరీర్ ఆరంభంలో టాటా గ్రూప్ కంపెనీలో కొంతకాలం పనిచేశారు. ఆయనకు భార్య చెన్నమ్మ,కుమారుడు,కుమార్తె ఉన్నారు.
కాగా,లింగాయత్ వర్గానికే సీఎం పదవిని కట్టబెట్టాలా లేక మరో సామాజికవర్గంతో ప్రయోగం చేయాలా అని తర్జనభర్జన పడ్డ బీజేపీ అధిష్ఠానం చివరకు లింగాయత్ వర్గానికే చెందిన బసవరాజ్ బొమ్మై వైపే మొగ్గుచూపడం గమనార్హం. ప్రస్తుత ఆపద్ధర్మ ముఖ్యమంత్రి యడియూరప్ప వీరశైవ లింగాయత్ వర్గానికి చెందినవారు కాగా బసవరాజ్ బొమ్మై సదర లింగాయత్ వర్గానికి చెందినవారు.
1956 నుంచి ఇప్పటివరకూ 20 మంది నేతలు కర్ణాటక ముఖ్యమంత్రులుగా వ్యవహరించగా ఇందులో ఎనిమిది మంది లింగాయత్ వర్గానికి చెందినవారే కావడం గమనార్హం. రాజకీయంగా ప్రభావవంతమైన శక్తిగా ఎదిగిన లింగాయత్ వర్గం రాష్ట్రంలోని 224 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 140 నియోజకవర్గాల్లో కీలకంగా ఉంది. రాష్ట్ర జనాభాలో ఈ వర్గం జనాభా దాదాపు 17శాతంగా ఉంది. దశాబ్దాలుగా ఈ వర్గం బీజేపీ ప్రధాన ఓటు బ్యాంకుగా ఉంటోంది.