కర్నాటకీయం, మినిట్ టు మినిట్ అప్డేట్ : అటు రెబల్, ఇటు జేడీఎస్.. కూర్గ్లో ఎమ్మెల్యేల క్యాంపు
బెంగళూరు : కర్ణాటక రాజకీయం రసవత్తరంగా మారింది. పూటకో మలుపు తిరుగుతుంది. జేడీఎస్-కాంగ్రెస్ సర్కార్ను అసంతృప్త ఎమ్మెల్యేలు వణికిస్తున్నారు. 13 మంది ఎమ్మెల్యేలు ముంబైలో క్యాంపు వేయడంతో సీఎం కుమారస్వామి, ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ చకచకా పావులు కదుపుతున్నారు. అయినా ఎమ్మెల్యేలు మాత్రం రాజీనామాలపై వెనక్కి తగ్గబోమని భీష్మించుకొని కూర్చొన్నారు. దీంతో అందుబాటులో ఉన్న నేతలతో కాంగ్రెస్, జేడీఎస్ నేతలు చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను క్యాంపు పెట్టగా .. జేడీఎస్ 37 మంది ఎమ్మెల్యేలను కూడా రిసార్ట్లో క్యాంపు పెట్టాలా అని యోచిస్తున్నారు.
జేడీఎస్ ఎమ్మెల్యేల క్యాంపు!!
కర్ణాటకలో రాజకీయ సంక్షోభంతో .. అమెరికాలో పర్యటనలో ఉన్న కుమారస్వామి ఆగమేఘాల మీద బెంగళూరు చేరుకున్నారు. వెంటనే పార్టీ నేతలు, కాంగ్రెస్ నేతలతో సంప్రదింపులు జరిపారు. దీంతోపాటు తన పార్టీ ఎమ్మెల్యేలతో క్యాంపు వేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి వారితో కుమారస్వామి సమవేశమయ్యాకే స్పష్టత రానుంది. ఎమ్మెల్యేలను మాత్రం మడికేరిలోని కూర్గ్కు తరలించాలని జేడీఎస్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ చోట అయితే సురక్షితమని ఆ పార్టీ భావిస్తోంది. దానికితోడు బెంగళూరుకు 265 కిలోమీటర్ల దూరం కూడా ఉండటం మరో కారణమని ఆ పార్టీ నేతలే చెప్తున్నారు. పరిస్థితి సద్దుమణిగాక .. వారిని మెల్లగా బెంగళూరు తరలించాలని జేడీఎస్ వర్గాలు భావిస్తున్నాయి.
ముంబైలో రెబల్ ఎమ్మెల్యేలు ..
సీఎం కుమారస్వామి అమెరికా పర్యటనలో ఉండగా 13 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అందులో 10 మంది ముంబైలోని ఓ హోటల్లో క్యాంపు వేశారు. వీరిలో కొందరు తమ రాజీనామాను వెనక్కి తీసుకోవాలంటే సిద్ధరామయ్యను సీఎం చేయాలని డిమాండ్ కూడా చేశారు. కానీ ఆ డిమాండ్పై కాంగ్రెస్, జేడీఎస్ స్పందించలేదు. దీంతో వారు ముంబైలో ఓ హోటల్లో క్యాంపు వేశారు. తమ రాజీనామా నిర్ణయంపై వెనక్కి తగ్గబోమని తేల్చిచెప్పారు. 13 మంది ఎమ్మెల్యేల రాజీనామాను స్పీకర్ ఆమోదించలేదు. ఒకవేళ ఆమోదిస్తే కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వం కూలపోతుంది.
ఇదీ లెక్క ..!!
అసెంబ్లీలో 225 స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే 113 మంది సభ్యుల మద్దతు తప్పనిసరి. అయితే 105 సీట్లు గెలిచిన బీజేపీ .. అధికారానికి 8 సీట్ల దూరంలో నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దీంతో జేడీఎస్ 37, కాంగ్రెస్ 78 సీట్లతో సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరింది. అయితే ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి సంకీర్ణ సర్కార్లో లుకలుకలు వినిపిస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ప్రభుత్వానికి బీఎస్పీ ఒకరు ఇండిపెండెంట్లు ఇద్దరి మద్దతుతో 118 సభ్యుల మద్దతు ఉంది. ఒకవేళ 13 మంది ఎమ్మెల్యేల రాజీనామాను ఆమోదిస్తే ప్రభుత్వం మైనార్టీలో పడిపోతుంది. అప్పుడు సర్కార్ బలం 105కి చేరుకుంటుంది. స్పీకర్కు కూడా అప్పుడు ఓటు ఉంటుంది.