Karnataka Polls : చిక్కపేట బరిలో కేజీఎఫ్ బాబు భార్య షాజియా-కాంగ్రెస్, బీజేపీలకు సవాల్
కర్నాటక ఎన్నికల్లో రోజుకో సంచలనం నమోదవుతూనే ఉంది. ఇప్పటికే అధికార బీజేపీతో పాటు విపక్ష కాంగ్రెస్ కూడా తప్పనిసరిగా టికెట్లు వస్తాయని అనుకున్న తమ పార్టీ నేతలు కొందరికి షాకులిచ్చేశాయి. దీంతో వారు పార్టీలు మారేందుకు, రెబెల్స్ గా పోటీ చేసేందుకు కూడా రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ టికెట్ నిరాకరించిన ఓ మిలియనీర్ ఇప్పుడు తన భార్యను తాను కోరుకున్న సీటు నుంచే ఇండిపెండెంట్ గా బరిలోకి దింపి సవాల్ విసురుతున్నాడు.
కేజీఎఫ్ ప్రాంతానికి చెందిన వ్యాపారి యూసుఫ్ షరీఫ్.. అలియాస్ కేజీఎఫ్ బాబు ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి చిక్ పేట అసెంబ్లీ సీటు కోసం పోటీపడ్డారు. అయితే గతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్ధిగా పోటీ చేసి ఓడిపోయిన ఆయనకు చిక్ పేట నుంచి టికెట్ ఇచ్చేందుకు ఆ పార్టీ నిరాకరించింది. దీని వెనుక కూడా ఓ ఆసక్తికర నేపథ్యం ఉంది. రెండేళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా బరిలోకి దిగిన కేజీఎఫ్ బాబు తన ఆస్తుల విలువ రూ.1743 కోట్లుగా ప్రకటించి సంచలనం సృష్టించారు.

అయితే బీజేపీ మాత్రం అప్పట్లో ఆయనకు రూ.1743కు రెట్టింపు ఆస్తులు ఉన్నాయని ఆరోపించింది. ఏదేమైనా ఆయన మాత్రం ఎమ్మెల్సీగా ఓడిపోయారు. ఆ తర్వాత ఈసారి చిక్ పేట అసెంబ్లీ సీటులో టికెట్ కోసం ప్రయత్నించారు. కానీ కార్తకర్తలతో విభేదాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. దీంతో ఆయన తన భార్య షాజియా తరన్నుమ్ ను అదే చిక్ పేట నుంచి ఇండిపెండెంట్ గా పోటీకి దించారు. అంతే కాదు ఆమెతో వెంటనే నామినేషన్ కూడా వేయించేశారు.
కర్నాటక ఎన్నికల్లో ఈసారి ధన ప్రవాహం తప్పదని భావిస్తున్న తరుణంలో తన భార్య షాజియాను గెలిపించుకునేందుకు కేజీఎఫ్ బాబు సీరియస్ గా ప్రయత్నిస్తే మాత్రం కాంగ్రెస్ తో పాటు బీజేపీకి కూడా చుక్కలు కనిపించడం ఖాయం. అయితే ఆమె ఇండిపెండెంట్ గా గెలిస్తే మాత్రం భవిష్యత్తులో తిరిగి కాంగ్రెస్ లో చేరినా ఆశ్చర్యం లేదంటున్నారు. ఈ నేపథ్యంలో కేజీఎఫ్ బాబు భార్య పోటీ ఇప్పుడు కర్నాటక రాజకీయాల్లో చర్చనీయాంశమవుతోంది.












Click it and Unblock the Notifications