తమిళనాడుకు నీరు విడుదల: కావేరీలో దూకిన రైతు
బెంగళూరు/మైసూరు: సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు కావేరీ నది నుంచి తమిళనాడుకు 15 వేల క్యూసెక్కుల నీటిని కర్ణాటక విడుదల చేసింది. కృష్ణరాజసాగర్ (కేఆర్ఎస్) నుంచి 11 వేలు, కబిని జలాశయం నుంచి నాలుగు వేల క్యూ సెక్కుల నీరు తమిళనాడుకు విడుదల చేశారు.
మంగళవారం రాత్రి 9 గంటలకు బెంగళూరులో అఖిలపక్ష సమావేశం జరిగింది. తరువాత తమిళనాడుకు నీరు విడుదల చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో తమిళనాడుకు నీటిని విడుదల చేశారు.
తమిళనాడుకు నీటిని విడుదల చెయ్యడాన్ని వ్యతిరేకిస్తూ కర్ణాటకలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి. బెంగళూరు-మైసూరు హైవేలో రోడ్లకు ఇరు వైపుల టైర్లు వేసి నిప్పంటించి నిరసన వ్యక్తం చేస్తున్నారు.
బెంగళూరు నగరంతో సహ బెంగళూరు గ్రామీణ, మండ్య, మైసూరు జిల్లాల్లో రైతులు ధర్నాలు నిర్వహిస్తున్నారు. తమిళనాడుకు నీరు విడుదల చేస్తే మేము ఆత్మహత్యలు చేసుకుంటామని రైతులు హెచ్చరించారు.
మాకే నీరులేక విలవిలలాడుతున్నామని, తమిళనాడుకు నీరు విడుదల చేస్తే తమ పరిస్థితి ఏమిటని రైతులుప్రశ్నించారు. చేతకాని ప్రభుత్వం అధికారంలో ఉందని, అందుకే సుప్రీం కోర్టులో న్యాయపోరాటం చెయ్యకుండా చేతులు ఎత్తేసిందని ఆరోపించారు.
కావేరీలోకి దూకిన అన్నదాత
తమిళనాడుకు నీటిని విడుదల చెయ్యరాదని డిమాండ్ చేస్తూ శ్రీరంగపట్టణం దగ్గర సూరి అనే అన్నదాత జోరుగా ప్రవహిస్తున్న కావేరీలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే విషయం గుర్తించిన పోలీసులు గజ ఈతగాళ్లను రంగంలోకి దించారు.
నదిలో కొట్టుకువెలుతున్న సూరిని రక్షించి ఒడ్డుకు చేర్చారు. మండ్య జిల్లాలో అనేక ప్రాంతాల్లో అన్నదాతలు ఆత్మహత్యాయత్నం చేశారు. అయితే వారిని వెంటనే ఆసుపత్రులకు తరలించడంతో ప్రాణాలతో బయటపడ్డారు.