కర్నాటక ఫలితాలు: హైదరాబాద్ రీజీయన్ - బెంగళూరులో బీజేపీ దూకుడు
బెంగళూరు: కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో హంగ్ వచ్చే పరిస్థితిలు కనిపిస్తున్నాయి. బీజేపీ - కాంగ్రెస్ పార్టీల మధ్య పోటా పోటీ నెలకొని ఉంది. బుధవారం ఉదయం తొమ్మిదింపావు సమయానికి బీజేపీ 82 స్థానాల్లో, కాంగ్రెస్ 76 స్థానాల్లో ముందంజలో ఉంది. జేడీఎస్ 37 స్థానాల్లో ముందంజలో ఉంది.
బీజేపీ బెంగళూరు రీజీయన్లో, హైదరాబాద్ కర్నాటక రీజియన్లో, సెంట్రల్ కర్నాటకలో ముందంజలో ఉంది. గుల్బర్గా జిల్లాలో ఐదు స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంది.
హైదరాబాద్ కర్నాటక రీజియన్లో బీజేపీ దూసుకెళ్తోంది. బళ్లారి ప్రాంతంలోను గాలి జనార్ధన్ రెడ్డి హవా కొనసాగుతోంది. గాలి జనార్ధన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో అరెస్టై బెయిల్ పైన విడుదలై నిషయం తెలిసిందే.
గాలి జనార్ధన్ రెడ్డి విషయంలో బీజేపీని ఇరుకున పెట్టాలని కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో బాదామిలో పోటీ చేస్తున్న శ్రీరాములు స్పందిస్తూ.. గాలి జనార్ధన్ రెడ్డి తన స్నేహితుడు మాత్రమేనని చెప్పారు. పార్టీ రాజకీయాలతో గాలికి ఎలాంటి సంబంధం లేదన్నారు.
మరోవైపు, ఒకవేళ హంగ్ అసెంబ్లీ ఏర్పడితే అధికారాన్ని చేపట్టేందుకు పార్టీలు తగిన వ్యూహాలకు పదును పెడుతున్నాయి. స్వతంత్రుల సహకారంతో ప్రభుత్వ ఏర్పాటు కుదరని పక్షంలో అతి తక్కువ బలమున్న రాజకీయ పక్షాన్ని చీల్చేందుకు ప్రధాన రాజకీయ పక్షాలు వెనుకంజ వేయబోవనే అంచనాలు ఉన్నాయి.