కర్నాటక ఎన్నికలు: అమిత్ షా-రాహుల్ గాంధీల సత్తా తేలిపోనుంది!
బెంగళూరు: దేశవ్యాప్తంగా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బుధవారం (ఈరోజు) వెలువడుతున్నాయి. 222 నియోజకవర్గాలకు ఎన్నికలు జరిగాయి. ఏ పార్టీకి ఆ పార్టీ గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
ఉదయం ఎనిమిది గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. రెండు మూడు గంటలల్లో దాదాపు ఫలితం తేలనుంది. హంగ్ వస్తుందా? బీజేపీ సత్తా చాటుకుంటుందా? కాంగ్రెస్ నిలబెట్టుకుంటుందా? జేడీఎస్ కింగ్ అవుతుందా, కింగ్ మేకర్ అవుతుందా అనే మరికొన్ని గంటల్లో తేలనుంది.
కాంగ్రెస్ అధ్యక్షులు రాహుల్ గాంధీ వ్యూహాలకు కన్నడసీమ వేదికయింది. దక్షిణాదిలో పార్టీని ముందుకు నడపడానికి బీజేపీ అధ్యక్షులు అమిత్ షా వేసిన ఎత్తుల ఫలితాలు తేలిపోతాయి. శక్తినంతా కూడదీసుకుని జేడీఎస్ అధ్యక్షులు హెచ్డి దేవేగౌడ సాగించిన పోరాటమూ చరిత్రబద్ధం కానుంది.
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలో జరిగిన ఎన్నికల పోరులో కాంగ్రెస్ గెలిచి తిరిగి అధికారాన్ని కొనసాగిస్తుందా? లేదా బీజేపీ అసెంబ్లీపై మరోసారి కాషాయ జెండాను ఎగురవేసి దక్షిణాదిలో ప్రాబల్యాన్ని విస్తరిస్తారా? ప్రాంతీయ పక్షాలే రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షిస్తాయంటూ ప్రచారం చేసిన జనతా దళ్కు జనాదరణ లభిస్తుందా? తదితర చిక్కుముళ్లు వీడనున్నాయి.
బీజేపీకి లేదా కాంగ్రెస్ పార్టీకి వంద లోపు సీట్లు వస్తే జేడీఎస్ కింగ్ మేకర్ అయ్యే అవకాశముంది. 105 లేదా అంతకంటే ఎక్కువ సీట్లు ఏ పార్టీకి ఎక్కువ వచ్చినా జేడీఎస్ చక్రం తిప్పే అవకాశాలు తక్కువే అంటున్నారు. ఎందుకంటే స్వతంత్రులు ఎక్కువ గెలుపొందితే వారి మద్దతు పొందే అవకాశాలు ఉంటాయి. మరోవైపు ఇంకా రెండు నియోజకవర్గాల్లో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఏ పార్టీ అధికారంలోకి వస్తుందని భావిస్తారో ఆ పార్టీకి ఆ నియోజకవర్గాల్లో గెలిచే అవకాశాలు ఎక్కువ.