సీఎం కొడుకు నామినేషన్: బోగస్ కంపెనీలు, రూ, 11 కోట్లు అప్పు, ఈసీకి ఫిర్యాదు, రద్దు చెయ్యండి!
బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి కుమారుడు నిఖిల్ కుమారస్వామి మండ్య లోక్ సభ నియోజక వర్గం నుంచి కాంగ్రెస్- జేడీఎస్ పార్టీల అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. నిఖిల్ కుమారస్వామి సమర్పించిన నామినేషన్ పత్రాలు సక్రమంగా లేవని, బోగస్ కంపెనీల పేర్లు పెట్టారని, వెంటనే ఆయన్ని ఎన్నికల్లో పోటీ చెయ్యడానికి అనర్హుడిగా ప్రకటించాలని ఎన్నికల అధికారులకు ఫిర్యాదులు చేశారు.
మని పవర్ రాజకీయాలు, మార్పు కోసం పోరాటం, రియల్ స్టార్ ఉపేంద్ర, ఎన్నిసీట్లు వస్తాయో!
గడువు ముగిసిన తరువాత నిఖిల్ నామినేషన్ పత్రాలు సమర్పించారని, ఆ పత్రాలను అధికారులు ఎలా అంగీకరిస్తారని సమాజిక కార్యకర్తలు (ఆర్ టీఐ) ప్రశ్నిస్తున్నారు. అధికార దుర్వినియోగంతో నిఖిల్ కుమారస్వామి సమర్పించిన నామినేషన్ పత్రాలను వెంటనే రద్దు చెయ్యాలని మనవి చేస్తూ ఆర్ టీఐ కార్యకర్తలు కర్ణాటక రాష్ట్ర ఎన్నికల చీఫ్ కు లేఖలు రాశారు.
ఓటరు ఐడీ కార్డు
మండ్య లోక్ సభ నియోజక వర్గం నుంచి నిఖిల్ కుమారస్వామి పోటీ చేస్తున్నారు. నిఖిల్ కుమారస్వామి ఎన్నికల అధికారులకు సమర్పించిన నామినేషన్ పత్రాలు తప్పుల తడకగా ఉందని ఆర్ టీఐ కార్యకర్త బిఎస్. గౌడ ఆరోపిస్తున్నారు. నామినేషన్ పత్రాల్లో నిఖిల్ కుమారస్వామి ఓటరు ఐడీ గుర్తింపు కార్డు నెంబర్ తప్పు రాశారని ఆర్ టీఐ కార్యకర్త బిఎస్. గౌడ ఆరోపిస్తున్నారు.
సాక్షాలు ఇస్తాం
ఓటరు ఐడీ కార్డులో నిఖిల్ కుమారస్వామి అనే పేరు ఉంది. అయితే నిఖిల్ కుమారస్వామి సమర్పించిన నామినేషన్ పత్రాలలో నిఖిల్. కే అని మాత్రమే ఉందని, అందుకు తగిన సాక్షాలు తాము అందిస్తామని, మీరు పరిశీలించి నిఖిల్ కుమారస్వామిని ఎన్నికల పోటీ నుంచి తప్పించాలని బిఎస్. గౌడ ఎన్నికల అధికారులకు మనవి చేశారు.
రూ. 50 లక్షల బోగస్ కంపెనీ?
నిఖిల్ కుమారస్వామి సమర్పించిన నామినేషన్ పత్రాల విషయంలో మరో ఆర్ టీఐ కార్యకర్త టీజే. అబ్రహం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నిఖిల్ కుమారస్వామి సమర్పించిన ఆస్తుల వివరాల్లో తాను మై రీడ్ మార్కెట్ సంస్థ నుంచి రూ. 50 లక్ష్లలు రుణం తీసుకున్నానని వివరించారు. అయితే అలాంటి సంస్థ ఎక్కడా లేదని, అది బోగస్ సంస్థ అని, వెంటనే నిఖిల్ నామినేషన్ పత్రాలు రద్దు చెయ్యాలని టీజే. అబ్రహాం ఎన్నికల కమిషన్ కు మనవి చేశారు.
రూ. 11 కోట్లు అడ్వాన్స్!
ఫిజ్జా డెవలపర్స్ నుంచి రూ. 11 కోట్లు అడ్వాన్స్ తీసుకున్నానని నిఖిల్ కుమారస్వామి నామినేషన్ పత్రాల్లో వివరించారు. అయితే ఎందుకు అంత మొత్తం నగదు తీసుకున్నారు, ఎక్కడ ఏ భూమి చూపించి రూ. 11 కోట్లు తీసుకున్నారు అని ఆరా తియ్యాలని ఆర్ టీఐ కార్యకర్తలు ఎన్నికల అధికారులకు మనవి చేశారు. ఫిజ్జా డెవలపర్స్ అనే సంస్థ చివరిసారిగా 2017లో ఆదాయపన్ను శాఖకు లెక్కలు చూపించిందని, ఈ విషయంపై క్షుణ్ణంగా విచారణ చేయించాలని ఆర్ టీఐ కార్యకర్తలు ఎన్నికల అధికారులకు మనవి చేశారు.
ఎన్నికల కమిషనర్ ఆరా!
మండ్యలో స్వతంత్ర పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుమలత మద్దతుదారులు సైతం నిఖిల్ కుమారస్వామి నామినేషన్ పత్రాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై కర్ణాటక రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సంజీవ్ కుమార్ మండ్య చేరుకుని పరిశీలించారు. నిఖిల్ కుమారస్వామి సమర్పించిన నామినేషన్ పత్రాలు సవ్యంగా ఉన్నాయని, వాటిని తిరస్కరించడం సాధ్యం కాదని, ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే కోర్టును ఆశ్రయించాలని సూచించారు. ఇదే సమయంలో మండ్య జిల్లా ఎన్నికల అధికారులు సక్రమంగా విధులు నిర్వహించలేదని అందిన ఫిర్యాదులపై విచారణ చేయిస్తామని సంజీవ్ కుమార్ స్పష్టం చేశారు.