కర్ణాటక లాక్డౌన్ మరింత కఠినం: రేపట్నుంచే: కేసీఆర్ ఫార్ములా ఇంప్లిమెంట్
బెంగళూరు: పొరుగు రాష్ట్రం కర్ణాటకలో ప్రస్తుతం అమల్లో ఉన్న లాక్డౌన్ మరింత కఠినతరం కానుంది. సుమారు నెల రోజులు లాక్డౌన్లో ఉంటోంది కర్ణాటక. అయినప్పటికీ- ఆశించిన స్థాయిలో కరోనా వైరస్ రోజువారీ పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టకపోవడంతో.. లాక్డౌన్ను మరింత కఠినంగా అమలు చేయబోతోంది. సోమవారం నుంచి దీన్ని అమల్లోకి తీసుకుని రానుంది. ఇప్పటిదాకా ఉన్న మినహాయింపులను కూడా బాగా తగ్గించి వేసింది. పోలీసులకు పూర్తి హక్కులను బదలాయించింది. రాష్ట్ర స్థాయి సరిహద్దులే కాదు.. జిల్లాల మధ్య రాకపోకలను కూడా బంద్ చేయనుంది.
కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కర్ణాటక ప్రభుత్వం కిందటి నెల 27వ తేదీన సంపూర్ణ లాక్డౌన్ను విధించింది. తొలుత 14 రోజుల పాటు దీన్ని కొనసాగించింది. రోజువారీ కేసుల సంఖ్యలో ఎలాంటి మార్పూ లేకపోవడంతో దీన్ని తొలిసారిగా కిందటి నెల 10వ తేదీన పొడిగించింది. రెండో విడత 14 రోజుల పాటు లాక్డౌన్ కొనసాగుతుందని తెలిపింది. సోమవారం నాటితో అంటే ఈ నెల 24వ తేదీతో ఈ లాక్డౌన్ ముగియాల్సి ఉంది. కేసుల సంఖ్య ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతుండటంతో.. లాక్డౌన్ను వచ్చేనెల 14వ తేదీ వరకు పొడిగించింది. మరింత కఠినతరం చేసింది.
ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వాన్ని అనుసరిస్తోంది.. కర్ణాటక సర్కార్. తెలంగాణ ప్రభుత్వం ఏపీతో సరిహద్దులను మూసివేసినట్టే..కర్ణాటక కూడా బోర్డర్లన్నింటినీ క్లోజ్ చేయనుంది. ఈ-పాస్ ఉన్న వాహనాలకు మాత్రమే అనుమతి ఇవ్వనుంది. వాణిజ్యపరమైన ట్రక్కులు, నిత్యావసర సరకుల వాహనాలపై ఎలాంటి ఆంక్షలు, నిషేధాన్ని విధించట్లేదు. అలాగే- అంబులెన్సుల రాకపోకలపైనా ఆంక్షలు లేవు. ఎప్పట్లాగే అవి రాష్ట్రాల మధ్య కూడా రాకపోకలు సాగించడానికి వీలు కల్పించింది. కాగా- ఈ సారి జిల్లాల మధ్య కూడా రాకపోకలను నిషేధించింది కర్ణాటక. ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు ప్రయాణించడాన్ని నిషేధించింది.
నిత్యావసర సరుకులు, పండ్లు, పాలు, కూరగాయాలను కొనుగోలు చేయడానికి తెల్లవారు జామున 6 నుంచి ఉదయం 10 గంటల వరకు అవకాశం కల్పించింది. ఆసుపత్రులు, పాల అవుట్ లెట్లు, మెడికల్ దుకాణాలు రోజంతా తెరిచి ఉంచడానికి అనుమతి ఇచ్చింది. తెల్లవారు జామున 6 నుంచి ఉదయం 10 గంటల్లోపల జిల్లాల మధ్య రాకపోకలు సాగించడానికి అవకాశం ఇచ్చింది. ఆ తరువాత వాహనాలను సీజ్ చేస్తామని కర్ణాటక హోం శాఖ మంత్రి బసవరాజ్ బొమ్మై తెలిపారు. గ్రామాల్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికే జిల్లాల మధ్య రాకపోకలను నిషేధించినట్లు చెప్పారు. లాక్డౌన్ను కఠినంగా అమలు చేసే విషయంలో పోలీసులకు పూర్తి అధికారాలను ఇచ్చామని అన్నారు.