కరోనా లాక్ డౌన్: కర్ణాటక సంచలనం.. జూన్1 నుంచి ఆలయాలు మాత్రమే.. మసీదు,చర్చిలకు నో చాన్స్..
మిగతా రాష్ట్రాలతో పోల్చుకుంటే కరోనా లాక్ డౌన్ సడలింపుల్లో కర్ణాటక బీజేపీ సర్కారు దూకుడు ప్రదర్శిస్తోంది. రెండో దశ లాక్ డౌన్ నుంచే అక్కడి అన్ని జోన్లలో ఎకనామిక్ యాక్టివిటీలు పున:ప్రారంభంకాగా, లాక్ డౌన్ 3.0లోనైతే ఏకంగా బెంగళూరు సిటీ బస్సులనూ నడిపించారు. ఇక 4.0 సడలింపుల్లో భాగంగా దాదాపు అంక్షలన్నీ ఎత్తేయడంతోపాటు రెస్టారెంట్లకు కూడా టేక్ అవే పర్మిషన్లు ఇచ్చేశారు. తాజాగా ఆధ్మాత్మిక రంగంపైనా కీలక నిర్ణయాలను వెలువరించారు.

జూన్ 1 నుంచి ఆలయాలు..
సడలింపుల్లో మేటిగా నిలిచిన కర్నాటక.. మే 31తో లాక్ డౌన్ 4.0 ముగియనుండటంతో ఆ తర్వాతి రోజు నుంచే.. అంటే జూన్ 1 నుంచే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాలను తెరవాలని డిసైడైంది. ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్పతో మంగళవారం సుదీర్ఘ భేటీ అనంతరం మజ్రాయి(ఎండోన్మెంట్) శాఖ మంత్రి కోట శ్రీనివాస పూజారి ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు. అయితే, జనం ఎక్కువగా గుమ్మికూడే అవకాశమున్న జాతరలు, వేడుకలపై మాత్రం నిషేధం కొనసాగుతుందని, తెరిచిన ఆలయాల్లో పాటించాల్సిన నిబంధనలపై త్వరలోనే మార్గదర్శకాలు విడుదల చేస్తామని ఆయన తెలిపారు.

తొలి రాష్ట్రంగా రికార్డు..
కరోనా వ్యాప్తి నేపథ్యంలో పబ్లిక్ గ్యాదరింగ్స్ ను పూర్తిగా నిషేధిస్తూ కేంద్ర హోం శాఖ మార్గదర్శకాలివ్వడంతో మార్చి 25 నుంచి దేశవ్యాప్తంగా అన్ని మతాల ప్రార్థనా స్థలాలు మూతపడ్డాయి. తప్పనిసరిగా క్రతువులు నిర్వహించే ఆలయాల్లో పూజలు తప్ప దర్శనాలకు అనుమతివ్వలేదు. మళ్లీ ఇన్నాళ్లకు ఆలయాలు తెరుస్తున్న తొలి రాష్ట్రంగా కర్ణాటక రికార్డులకు ఎక్కనుంది. సాధారణ భక్తుల నుంచి పండితుల దాకా ప్రతి ఒక్కరూ ఆలయాలు తెరవాల్సిందేనని డిమాండ్ చేస్తున్న నేపథ్యంలోనే ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి శ్రీనివాస చెప్పారు. అయితే..

ఒక్క మతానికే అనుమతిపై వివాదం..
కాగా, మంగళవారం నాటి ప్రభుత్వ నిర్ణయంలో కేవలం ఆలయాలను మాత్రమే తెరుస్తున్నట్లు పేర్కొనడంపై వివాదం చెలరేగింది. లాక్ డౌన్ వేళ బీజేపీ మతరాజకీయాలకు పాల్పడుతున్నదని, హిందూ ఆలయాలను మాత్రం తెరిచి, మసీదులు, చర్చిలను మూసిఉంచాలనడం కరెక్టు కాదని కాంగ్రెస్ పార్టీ విమర్శించింది. ‘‘తెరిస్తే అన్ని మతాల ఆలయాలను ఒకేసారి తెరవండి. లేదా అన్నింటినీ మూసే ఉంచండి. అలాకాకుండా ఒక మతానికి అనుమతించి, మిగతా వాటిపై ఆంక్షలు కొనసాగించడం మూర్ఖత్వమే అవుతుంది''అని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఎన్ఏ హరిస్ మండిపడ్డారు. అదీగాక, కేంద్రం మార్గదర్శకాలు రాకముందే ఆథ్యాత్మిక సంస్థలపై ముందస్తు నిర్ణయం తీసుకోవడమేంటని ఎమ్మెల్యే ప్రశ్నించారు.
Recommended Video

ఆగని వైరస్ వ్యాప్తి..
ఓవైపు ప్రభుత్వం సడలింపుల మీద సడలింపులు ప్రకటిస్తుండగా... కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తూ పోతున్నది. కర్ణాటకలో మంగళవారం ఒక్కరోజే కొత్తగా 101 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2283కు పెరిగింది. అందులో 44 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 748మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. యాక్టివ్ కేసుల సంఖ్య 1489గా ఉంది. కొత్త కేసులు క్రమంగా పెరుగుతున్నా యడ్డీ సర్కారు సడలింపుల జోరు మాత్రం తగ్గడంలేదు.












Click it and Unblock the Notifications