ఎన్టీఆర్ రోజుల నుంచి చూస్తున్నా: బాబుపై కరుణానిధి
న్యూఢిల్లీ: తన ప్రియమైన పాత మిత్రుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు హయాం నుంచి తాను ప్రస్తుత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి రాజకీయ ఎదుగుదలను గమనిస్తున్నట్లు డిఎంకె అధినేత, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి అన్నారు. ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర)లో విజయం సాధించినందుకు ఆయన మంగళవారం చంద్రబాబును అభినందించారు.
తెలివైన చర్యల ద్వారా, నిజాయితీతో కూడిన శ్రమ ద్వారా చంద్రబాబు నాయుడు విజయం సాధించారని ఆయన ప్రశంసించారు. చంద్రబాబు తెలివైన చర్యలు, కఠిమైన, నిజాయితీతో కూడిన శ్రమ కారణంగా చంద్రబాబు ప్రజల హృదయాలకు సన్నిహితంగా ఉన్నారని ఆయన అన్నారు.
ఆ మేరకు ఆయన చంద్రబాబుకు లేఖ రాశారు. చంద్రబాబు నాయకత్వంలో సీమాంధ్ర ప్రశాంతమైన, ప్రయోజనకరమైన పరిపాలనను చూస్తుందని తనకు నమ్మకం ఉందని ఆయన అన్నారు. చంద్రబాబుకు, టిడిపికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.
సీమాంధ్రలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు జూన్ 8వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు.