ఏం చేస్తారు: రజనీకాంత్తో శశికళ వర్గం ఎమ్మెల్యే భేటీ
గురువారం నాడు చెన్నై పోయెస్ గార్డెన్లోని రజనీ నివాసంలో కరుణాస్ ఆయన్ను కలిశారు. సుమారు అరగంట పాటు వీరిద్దరి మధ్య భేటీ జరిగినట్లు తెలుస్తోంది.
చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్పైనే అందరి దృష్టీ ఉంది. ఆయన రాజకీయాల్లోకి వస్తారా, లేదా అనే ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. జయలలిత మృతితో ఏర్పడిన ఖాళీని తమిళనాడులో భర్తీ చేయడానికి ఆయన రాజకీయాల్లోకి వస్తారని ఊహాగానాలు చెలరేగుతున్నాయి.
ఈ నేపథ్యంలో రజనీకాంత్తో గుణచిత్ర నటుడు, తిరువాడనై శాసనసభ్యుడు కరుణాస్ గురువారం ఆకస్మికంగా సమావేశమయ్యారు. ఆయన శశికళ శిబిరానికి చెందినవారు. ఆయన రజనీకాంత్ను కలవడంతో తమిళ రాజకీయాలు మలుపు తిరుగుతాయా అనే ప్రశ్న ఉదయిస్తోంది.
చెన్నై పోయెస్ గార్డెన్లోని రజనీకాంత్ నివాసానికి కరుణాస్ గురువారం వెళ్లారు. సుమారు అరగంట సేపు రజనీకాంత్తో సమావేశమయ్యారు. ఇప్పటికే రజనీకాంత్ను బిజెపి తన వైపు ఆకర్షించడానికి ప్రయత్నిస్తోందని, ఆయన కూడా రాజకీయ ప్రవేశం చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది.
భేటీకి రాజకీయ ప్రాధాన్యం ఉందా...
రజనీకాంత్ను బిజెపి తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తోందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో శశికళ శిబిరానికి చెందిన కరుణాస్ భేటీతో తమిళనాడు రాజకీయాల్లో మార్పులు వచ్చే ఆలోచనలు సాగుతున్నాయని అంటున్నారు. రజినీకాంత్తో భేటీ తర్వాత కరుణాస్ మీడియాతో మాట్లాడారు.
దాని కోసం కలిశా..
రజనీకాంత్ హీరోగా నటించిన బాషా చిత్రం డిజిటలైజ్ చేసిన నేపథ్యంలో శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చానని కరుణాస్ తెలిపారు. మర్యాదపూర్వకంగానే ఈ భేటీ జరిగిందని, ఇందులో తమిళనాడు ప్రస్తుత రాజకీయాల గురించి ప్రస్తావించలేదని తెలిపారు. రజనీకాంత్ అంటే తనకు చాలా ఇష్టమని, తనంటే ఆయనకూ అభిమానమని చెప్పారు.
రజనీకాంత్ ఉపదేశాలు చేశారు...
భేటీలో తనకు, తన కుటుంబానికి రజనీకాంత్ కొన్ని హితోపదేశాలు చేశారని కరుణాస్ తెలిపారు. జయలలిత మృతిపై అనుమానాలు ఉన్నాయంటూ న్యాయవిచారణ కోరడం అర్థరహితమని ఆయన అన్నారు. ఇది ప్రజలను మోసపుచ్చే చర్య అని విమర్శించారు. అమ్మ పాలనను కాపాడాలని, అమ్మ పథకాలు కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు.
రజనీకాంత్ మనసులో మాట ఏమిటో...
రజనీకాంత్ రాజకీయ ప్రవేశం గురించి ఎప్పటికప్పుడు ఊహాగానాలు చెలరేగుతూనే ఉన్నాయి. అయినా రజనీకాంత్ మాత్రం పెదవి విప్పడం లేదు. ఆయన మనసులో ఏముందో ఎవరికీ తెలియడం లేదు. ఈ వయస్సులోనూ ఆయన సినిమాల ద్వారా అభిమానులను అలరిస్తూనే ఉన్నారు. ఆయన రాజకీయాలను కూడా నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే,
ప్రజల్లో ఇప్పటికే శశికళ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉన్న నేపథ్యంలో.. రజనీకాంత్ లాంటి వ్యక్తులతో భేటీ అయినా, వారు సానుకూలంగా స్పందించినా పార్టీ పట్ల జనంలో విశ్వసనీయత పెరుగుతుందని శశికళ భావిస్తుండవచ్చు అన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. కాబట్టి ఈ భేటీ వెనుక ప్లాన్ అంతా శశికళదే అనేవారు కూడా లేకపోలేదు.