యూపీ ఎన్నికల వేళ: ప్రధాని మోడీ డ్రీమ్ ప్రాజెక్ట్: రేపే ప్రారంభం: రూ.800 కోట్ల ఖర్చుతో..
లక్నో: ఇంకొన్ని నెలల్లో ఉత్తర ప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికల భేరీ మోగనుంది. దేశ రాజకీయాలను సమూలంగా మార్చివేసే, కేంద్రంలో ఏ కూటమి అధికారంలోకి రావాలనేది నిర్దేశింత సత్తా గల అతి పెద్ద రాష్ట్రంగా దీనికి గుర్తింపు ఉంది. లోక్సభ స్థానాల సంఖ్య భారీగా ఉండటమే దీనికి కారణం. 80 లోక్సభ స్థానాలు ఉన్నాయి ఇక్కడ. శాసన సభ సీట్ల సంఖ్య కూడా తక్కువేమీ కాదు. 403 అసెంబ్లీ స్థానాలు ఉన్న రాష్ట్రం ఇదొక్కటే. ఇక్కడ భారతీయ జనతా పార్టీ పాగా వేసింది. సింగిల్గా 309 స్థానాలను కైవసం చేసుకుంది.

నిధుల గుమ్మరింత..
అదే జోరును వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొనసాగించాలనే పట్టుదలను ప్రదర్శిస్తోంది. వచ్చే ఫిబ్రవరిలో ఉత్తర ప్రదేశ్ సహా ఉత్తరాఖండ్, గోవా, పంజాబ్, మణిపూర్లల్లో అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల కమిషన్.. నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ పరిణామాల మధ్య కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కూడా ఉత్తర ప్రదేశ్పై నిధులను గుమ్మరిస్తోంది. భారీ ఎత్తున ప్రాజెక్టులను ప్రకటిస్తోంది.
కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్ట్..
ఇందులో భాగంగా ప్రతిష్ఠాత్మక కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్ట్ను చేపట్టింది కేంద్ర ప్రభుత్వం. ఈ కారిడార్ ప్రాజెక్ట్ నిర్మాణ వ్యయం 800 కోట్ల రూపాయల పైమాటే. దీని నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ప్రారంభానికి సిద్ధమైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. సోమవారం ఈ ప్రాజెక్ట్ను ప్రారంభించనున్నారు. ప్రముఖ ఆర్కిటెక్ట్ భీమల్ పటేల్.. ఈ కారిడార్ నిర్మాణ డిజైన్లను రూపొందించారు. దేశ రాజధానిలో రూపు దిద్దుకుంటోన్న సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ డిజైన్లను కూడా ఆయనే తయారు చేశారు.

రెండో కారిడార్ జనవరిలో..
రెండు కారిడార్లుగా కాశీ విశ్వనాథ్ ప్రాజెక్ట్ రూపొందింది. తొలి కారిడార్ రేపటి నుంచి అందుబాటులోకి వస్తుంది. రెండో కారిడార్ను జనవరిలో ప్రారంభించే అవకాశం ఉంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటానికి కొద్ది రోజుల ముందు రెండో కారిడార్ను అందుబాటులోకి తీసుకొస్తారనే ప్రచారం ఉత్తర ప్రదేశ్లో జోరుగా సాగుతోంది. వారణాశి ప్రాచీన చరిత్ర, కాశీ విశ్వనాథుని ఆలయం వైభోగాన్ని ప్రపంచానికి చాటి చెప్పేలా ఈ కారిడార్ను రూపొందించినట్లు తెలుస్తోంది.
వారణాశి చరిత్రను ప్రతిబింబించేలా..
మరాఠా మహారాణి అహల్యాబాయి హోల్కర్ విగ్రహాన్ని నెలకొల్పారు. 17వ శతాబ్దంలో కాశీ విశ్వనాథుడి ఆలయాన్ని ఆమె జీర్ణోద్ధరించారు. టెంపుల్ చౌక్, వారణాశి సిటీ గ్యాలరీ, మ్యూజియం, ఆడిటోరియాలు, భజన మందిరాలు, భక్తుల సౌకర్యాల కోసం కొత్తగా నిర్మించిన వసతి గదులు, గోడౌలియా గేట్, భోగ్శాల, ఆలయ అర్చకులు, సేవకుల కోసం విశ్రాంతి కేంద్రాల వంటివి.. ఈ కారిడార్ ప్రాజెక్టులో అంతర్భాగంగా నిర్మించారు. ఘాట్ల నిర్మాణం, పునరుద్ధరణ, ఇతర సౌకర్యాలకు రెండో కారిడార్లో ప్రాధాన్యత ఇచ్చినట్లు చెబుతున్నారు.

20 రోజుల్లో మూడో భారీ ప్రాజెక్ట్..
ఉత్తర ప్రదేశ్లో 20 రోజుల వ్యవధిలో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించనున్న మూడో భారీ ప్రాజెక్ట్ ఇదే కావడం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించకుంది. కిందటి నెలలో గ్రేటర్ నొయిడాలో విమానాశ్రయాన్ని ప్రధాని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా ఒక్క ఉత్తర ప్రదేశ్లోనే అయిదు విమానాశ్రయాలు అందుబాటులోకి వచ్చినట్టయింది. రెండు రోజుల కిందటే సరయూ నదీ కాలువ ప్రాజెక్ట్ను ఆయన ప్రారంభించారు. ఇప్పుడు తాజాగా కాశీ విశ్వనాథ్ ప్రాజెక్ట్ అందుబాటులోకి రానుంది.












Click it and Unblock the Notifications