యూరీ ఉగ్రదాడిపై అభ్యంతరకర పోస్ట్: కాశ్మీర్ విద్యార్థికి షాక్
ఆలీగఢ్: జమ్మూకాశ్మీర్ యూరీ సెక్టార్లోని సైనిక శిబిరంలో జరిగిన ఉగ్రదాడిని సమర్ధిస్తూ కాశ్మీర్కు చెందిన ఓ విద్యార్థి ఫేస్బుక్లో అభ్యంతరకర పోస్ట్ చేశాడు. దీంతో అతడిపై ఫిర్యాదు అందడంతో యూనివర్సిటీ నుంచి అతడిని తొలగించింది.
వివరాల్లోకి వెళితే... శ్రీనగర్కు చెందిన ముదస్సార్ యూసఫ్ అనే యువకుడు ఉత్తరప్రదేశ్లోని ఆలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయంలో ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ విద్యను అభ్యసిస్తున్నాడు. ఆదివారం ఉదయం యూరీ సైనిక శిబిరంపై జరిగిన ఉగ్రదాడిపై భారత్కు వ్యతిరేకంగా ఫేస్బుక్లో అతడు పోస్ట్ చేశాడు.
దీనిపై వర్సిటీ వైస్ ఛాన్సలర్ లెఫ్టినెంట్ జనరల్ జమీర్ ఉద్దీన్ షా తీవ్రంగా స్పందించారు. భారత వ్యతిరేక భావాలను ఏమాత్రం సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. యూసఫ్ను వెంటనే యూనివర్శిటీ నుంచి బహిష్కరించారు. అయితే తాను నమ్మిన సిద్ధాంతాల ప్రభావంతోనే అలా చేశానని, క్షమించమని ఆ విద్యార్థి కోరినప్పటికీ అతడిని వర్సిటీ నుంచి తొలగించారు.
మరోవైపు ఆలీగడ్ బీజేపీ లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ ఎంపీ సతీష్ కుమార్ గౌతమ్ విద్యార్ధి పేస్ బుక్ పోస్టుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరుతూ లెటర్ రాశారు. కాగా, ఆదివారం జరిగిన యూరీ ఉగ్రదాడిలో 18 మంది భారత జవాన్లు మరణించగా నలుగురు ఉగ్రాదులు మరణించారు.