నెలలుగా చెప్తూనే ఉన్నారు: రాజ్నాథ్తో కవిత (ఫొటో)
న్యూఢిల్లీ: తెలంగాణలో ప్రజల కష్టాలకు కారణం కేంద్రం ఉద్యోగులను విభజించకపోవటమేనని నిజామాబాద్ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఉద్యోగుల విభజన కోరుతూ కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ను ఆమె కలిసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం నార్త్బ్లాక్ వద్ద ఆమె మీడియాతో మాట్లాడారు.
తన వినతి పత్రానికి రాజ్నాథ్ స్పందిస్తూ - తెలంగాణ అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని, తమకు తెలంగాణ అయినా, ఏపీ అయినా ఒక్కటేనని చెప్పారన్నారు. సానుకూలంగా స్పందిస్తామని ఆయన 4 నెలలుగా చెబుతూనే ఉన్నారని, అయినా ఎలాంటి చర్యలూ చేపట్టలేదని కవిత విమర్శించారు. ఎప్పటిలోపు ఉద్యోగుల విభజన చేస్తామన్న సంగతి రాజ్నాథ్ చెప్పకపోవటం బాధాకరమన్నారు.
రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో తెలంగాణకు అఖిల భారత సర్వీసు అధికారుల కేటాయింపుప్రక్రియను సత్వరమే పూర్తిచేసి సాఫీగా పాలన సాగటానికి సహకరించవలసిందిగా ఆమె రాజనాథ్ సింగ్కు విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆమె హోమ్ మంత్రితో సమావేశమై అఖిల భారత సర్వీసు అధికారులు, రాష్ట్రం జోనల్ స్థాయి అధికారుల కేటాయింపులో జరుగుతున్న జాప్యం వల్ల ఎదురవుతున్న ఇబ్బందులను వివరించారు.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి ఐదు నెలలు దాటిపోయినా అధికారుల కేటాయింపులో జరుగుతున్న జాప్యంవల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆమె చెప్పారు. అవిభక్త రాష్ట్రంలో ఉద్యోగాలు, నీటి పంపిణీలో తెలంగాణకు అన్యాయం జరిగిందన్న భావనే విభజన ఉద్యమానికి దారితీసిందని గుర్తుచేశారు. రాజ్నాథ్ సింగ్ తన అభిప్రాయాలతో ఏకీభవించి సానుకూలంగా స్పందించినప్పటికీ కచ్చితమైన వ్యవధిలో పూర్తిచేసే విషయంలో స్పష్టమైన హామీ ఇవ్వలేదని ఆమె తెలిపారు.
తెలంగాణ వారిని ఆంధ్రకు బదిలీ చేసి, ఆంధ్రకు చెందినవారిని తెలంగాణకు కేటాయించే విధానాన్ని అమలు చేయవద్దని ఆమె కోరారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావంతో తమ సమస్యలు సమసిపోతాయని ఆశించిన ఉద్యోగులకు న్యాయం చేయాలని ఆమె హోమ్ మంత్రికి విజ్ఞప్తి చేశారు.