ఎన్డీయే కూటమికే కేసీఆర్ మద్దతు! అధినేత నిర్ణయానికి వ్యతిరేకంగా సొంత ఎంపీ!!
సమయం లేదు మిత్రమా..! రణమా..? శరణమా..?? అనే డైలాగ్ ఇప్పుడు రాజ్యసభ ఎన్నికల అభ్యర్థులకు వర్తించేలా కనిపిస్తోంది. బలాబలాల సమీకరణలో అదికార, విపక్ష నేతలు తమ ప్రయత్నాలకు పదును పెంచారు. అనుమానంగా ఉన్న అభ్యర్థులకు తాయిలాలు సమర్పించి తన్నుకుపోయేందుకు అదికార బీజెపీ పార్టీ కసరత్తు చేస్తుంటే, తటస్థ ఎంపీల మద్దత్తు కోసం విపక్ష కూటమి నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేసారు. ఇదిలా ఉంటే ఎండీయే అభ్యర్థికి మద్దత్తు ప్రకటించిన టీఆర్ఎస్ పార్టీకి ఆ పార్టీ ఎంపీ ఒకరు ఝలక్ ఇవ్వబోతున్నారు. పార్టీ లైన్ కాదని తన ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఈ విషయం గ్రహించి అవాక్కయ్యారు గులాబీ పార్టీ పెద్దలు. గులాబీ బాస్ మాటను దిక్కరించి ఓటు వేసేందుకు సాహసిస్తున్న ఆ ఎంపీ ఎవరు..? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..!
రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్ ఎన్నికలో ఉత్కంఠ..! అదికార పక్షంలో కొలిక్కి రాని లెక్క..!!
సమయం దగ్గరవుతున్న కొద్దీ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక ఉత్కంఠ రేపుతోంది. అటు కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే.. ఇటు విపక్షాలు ఈ స్థానంపై కన్నేశాయి. ఎన్డీయేకు ధీటుగా విపక్షాలు కూడా ఉమ్మడి అభ్యర్ధిని ప్రకటించే అవకాశం ఉండడంతో ఈ ఎన్నిక రసవత్తరంగా సాగే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఏ కూటమి గెలవాలన్నా తటస్థ పార్టీల మద్దతును కూడగట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం ఉన్న బలాబలాల ప్రకారం.. 89 మంది సభ్యుల ఎన్డీఏ తన అభ్యర్థిని గెలిపించుకోవాలంటే 123 మంది మద్దతు అవసరం. అంటే ఇంకా 34 మంది మద్దతు కావాలి.
చక్రం తిప్పుతున్న మోదీ..! లెక్క సరిపోతుందా..? సందేహమే..!
అన్నాడీఎంకే (13), బీజేడీ (9), టీఆర్ఎస్ (6), వైసీపీ (2) తనకే సహకరిస్తాయని ఎన్డీఏ భావిస్తోంది. నలుగురు నామినేటెడ్ సభ్యులూ ఓటేస్తే అధికారిక అభ్యర్థి విజయం ఖాయంగా కనిపిస్తోంది. సంఖ్యాపరంగా చూస్తే.. ఎన్డీఏ కంటే ప్రతిపక్షాలకే ఎక్కువ మంది సభ్యులు (112 మంది) ఉన్నారు. మరో 11 మంది సహకరిస్తే విపక్ష అభ్యర్థి గెలుపొందుతారు. అందుకోసమే తటస్థంగా ఉన్న పార్టీలు ఎవరికి మద్దతిస్తాయోనన్న దానిపై ఆసక్తి నెలకొంది.
మోదీకి మాటిచ్చిన కేసీఆర్..! ఓటు గల్లంతైతే ఏంటన్న టెన్షన్..!!
బీజేపీకి అనుకూలంగా ఉన్నాయని చెప్పుకునే తటస్థ పార్టీల్లో టీఆర్ఎస్ ఒకటని ప్రచారం జరుగుతోంది. ఈ ఎన్నికలో కూడా ఆ పార్టీ ఎన్డీయేకు మద్దతు తెలుపుతుందని బీజేపీ కూడా భావిస్తోంది. టీఆర్ఎస్కు ప్రస్తుతం ఆరుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. వారిలో ఒకరైన డీ శ్రీనివాస్.. ఆ పార్టీకి దూరమయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన పరిణామాలతో తీవ్ర అసంతృప్తితో ఉన్న డీఎస్.. టీఆర్ఎస్ను వీడబోతున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.
డీయస్ కు చెప్పేదెవరు...? దారిలోకి తెచ్చేదెవరు..??
అంతేకాదు, ఆయనతో కాంగ్రెస్కు చెందిన జాతీయ స్థాయి నేతలు భేటీ అయ్యారని, త్వరలోనే ఆయన సొంతగూటికి చేరుకోనున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. ఒక్కో ఓటు కీలకంగా మారిన డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో డీ శ్రీనివాస్ ఓటు కూడా అత్యంత ముఖ్యమైనదే కాబట్టి, ఆయన ఏ కూటమికి మద్దతిస్తారన్నది ఆసక్తికరంగా మారింది. పార్టీకి కట్టుబడతారా..? లేక సొంత స్టాండ్ తీసుకుంటారా..? అనే ఉత్కంఠ నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో ఓ వార్త బయటికొచ్చింది. డీఎస్ విపక్షాలు బలపరిచే అభ్యర్ధికే ఓటు వేయనున్నారనేదే ఆ వార్త సారాంశం.