భేటీ: లెక్క చేయకుండా వచ్చారని ఫడ్నవీస్, డిజైన్పై కెసిఆర్
ముంబై: తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు మంగళవారం సాయంత్రం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్తో భేటీ అయ్యారు. ఇరు రాష్ట్రాలకు సంబంధించిన నీటి పారుదల ప్రాజెక్టులపై ముఖ్యమంత్రుల మధ్య చర్చలు జరిగాయి. పొరుగు రాష్ట్రాలతో ఘర్షణ వైఖరి అవలంబించబోమని కెసిఆర్ అన్నారు. నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో పరస్పరం సహకరించుకోవాలని వారిరువురు ఓ అవగాహనకు వచ్చారు. తన పుట్టిన రోజును కూడా లెక్క చేయకుండా కెసిఆర్ ప్రజల క్షేమం కోసం వచ్చారని మహారాష్ట్ర ముఖ్యమంత్రి అభినందించారు.
గోదావరి నదిపై తెలంగాణలో తలపెట్టిన ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా రావడానికి తన సహకారం అందిస్తానని ఫడ్నవీస్ కెసిఆర్కు హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం విషయంలో ముంపు ప్రాంతాలను తగ్గించేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు చేపట్టాలని ఇరువురు ముఖ్యమంత్రులు అవగాహనకు వచ్చారు. తెలంగాణ రాష్ట్రం 160 టిఎంసిల గోదావరి నదీ జలాలను వాడుకోవచ్చునని ఫడ్నవీస్ చెప్పారు.
అంతర్రాష్ట్ర ప్రాజెక్టుల నిర్మాణానికి ఇరువురం సహకరించుకుంటామని కెసిఆర్ చెప్పారు. నీటి పారుదల ప్రాజెక్టులకు సంబంధించి ఇరు రాష్ట్రాలకు చెందిన ఓ నిపుణుల కమిటీ వేయాలని ముఖ్యమంత్రులు నిర్ణయించుకున్నారు. ఈ నిపుణుల కమిటీ భూసేకరణ, నష్టపరిహారం, కోర్టు కేసుల పరిష్కారం, ముంపు ప్రజల అభ్యంతరాలపై అధ్యయనం చేస్తుంది. రెండు రాష్ట్రాల నీటి పారుదల ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయాలని ఫడ్నవీస్, కెసిఆర్ అనుకున్నారు.
రెండు రాష్ర్టాల మధ్య ఉన్న పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులతోపాటు ప్రాణహిత-చేవెళ్ల , లెండి, పెన్గంగ ఇచ్చంపల్లి చెక్డ్యాంలపై కెసిఆర్, ఫడ్నవీస్ చర్చించారు. ఈ సమావేశానికి తెలంగాణ మంత్రులు హరీష్ రావు, జోగురామన్న ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్రావు, ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లా నాయకులు హాజరయ్యారు.ఇరు రాష్ర్టాలు సమన్వయంతో గోదావరి జలాలను వాడుకోవాలని తీర్మానం చేశామని, ఎప్పటికప్పుడు చర్చల ద్వారా నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించామని ఫడ్నవీస్ అన్నారు. లెండి ప్రాజెక్టుకు సంబంధించి 2003లో కుదిరిన అవగాహన మేరకు 6 టీఎంసీలకు పైగా గోదావరి జలాలను రెండు రాష్ర్టాల రైతులకు మళ్లించాలని ఇద్దరు సీఎంలు ఏకాభిప్రాయంకు వచ్చారు. తన పుట్టిన రోజని కూడా చూడకుండా తెలంగాణ ప్రజల కోసం కేసీఆర్ మహారాష్ట్ర వరకు వచ్చారని అభినందించారు.
గత ప్రభుత్వం రూపొందించిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ సరిగా లేదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు స్పష్టం చేశారు. ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా ఇచ్చేందుకు కేంద్రం అంగీకరించినందున మహారాష్ట్ర సర్కారు సహకరించాలని ఫడ్నవిస్ను కేసీఆర్ కోరారు. ప్రస్తుత డిజైన్తో ముంపు ప్రాంతం ఎక్కువగా ఉందని, ఎక్కువ ప్రాంతం ముంపుకు గురికాకుండా ఉండేందుకు ప్రత్యామ్నయ మార్గాలను అన్వేషిస్తున్నామని కేసీఆర్ తెలిపారు. రెండు రాష్ర్టాలు గోదావరి జలాలను సమన్వయంతో వాడుకోవాలని తీర్మానించుకున్నారు.