ఏదంటే అది!: కేసీఆర్కు మోడీ హామీ, బాబు ప్రస్తావన
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడిదంని, ఏ సమస్య వచ్చినా తక్షణం తనకు చెప్పాలని, సమస్యల పరిష్కారానికి పెద్దన్నగా కృషి చేస్తానని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భరోసా ఇచ్చారు. అనవసరంగా గొడవ పడొద్దని, తెలుగు రాష్ట్రాలు సామరస్యంగా ఉండాలని హితవు పలికారు. ఇదే సమయంలో తెలంగాణకు ప్రత్యేక స్టేటస్ ఇవ్వాలని కేసీఆర్ కోరారు.
కేసీఆర్ శనివారం రోజంతా ఢిల్లీలో బిజీబిజీగా గడిపారు. ఉదయం 11 గంటలకు ప్రధాన మంత్రి మోడీతో భేటీ అయ్యారు. అరగంటకు పైగా చర్చలు జరిపారు. అనంతరం మధ్యాహ్నం 1.15 గంటలకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిశారు. ఆ వెంటనే విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ను కలిశారు.
ఆయనతో గంటపాటు చర్చలు జరిపారు. తర్వాత కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్తో భేటీ అయ్యారు. తెలంగాణకు ఏది కావాలంటే అది చేస్తానని, ఎన్ని స్మార్ట్ సిటీలు అయినా ఇస్తానని, ప్రతిపాదనలు ఇవ్వాలని మోడీ కేసీఆర్కు సూచించారు. ఉమ్మడి హైకోర్టును విభజిస్తామని, ప్రస్తుతం ఉన్న భవనంలోనే రెండు హైకోర్టులను నిర్వహిస్తామని రవిశంకర్ ప్రసాద్ కేసీఆర్కు స్పష్టం చేశారు.
ఇక తెలంగాణకు అదనపు విద్యుత్తును ఇప్పటికిప్పుడు ఇవ్వలేమని, మార్చినాటికి కృషి చేస్తామని స్పష్టం చేసిన విద్యుత్తు శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలంగాణలో 5000 మెగావాట్ల విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు.
పార్టీ ఎంపీలతో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రధానిని ఆయన నివాసంలో కలిశారు. అరగంటపాటు చర్చలు జరిపారు. వెనకబడిన తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పారిశ్రామికాభివృద్ధి కోసం పన్ను రాయితీలు ఇవ్వాలని ప్రధానిని కేసీఆర్ కోరారు.
అలాగే, రూ.6 వేల కోట్ల క్యాంపా నిధుల విడుదల, సీఎస్టీ పరిహారం, 4 వేల మెగావాట్ల ఎన్టీపీసీ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు, దానికి బొగ్గు కేటాయింపు, మరో 500 మెగావాట్ల అదనపు విద్యుత్, వెయ్యి మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రం, ఐఐఎం ఏర్పాటు, హైదరాబాద్లోని ఎన్ఐడీని కొనసాగించటం, బయ్యారంలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు, హైదరాబాద్-నాగ్పూర్.. హైదరాబాద్-వరంగల్ పారిశ్రామిక కారిడార్ ఏర్పాటు, ఎలకా్ట్రనిక్ ఉత్పత్తుల క్లస్టర్, జహీరాబాద్లో జాతీయ పెట్టుబడులు, ఉత్పత్తుల జోన్ను ఏర్పాటు చేయడం, సాగునీటికి సంబంధించి ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా, తెలంగాణలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టుల నిర్మాణం, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు, ప్రతి గ్రామానికీ తాగునీరు అందించేందుకు వాటర్ గ్రిడ్ ఏర్పాటుకు కేంద్రం నిధులు కేటాయించడంతోపాటు ఉత్తర తెలంగాణలో నాలుగు విమానాశ్రయాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మోడీని కేసీఆర్ కోరారు. దీంతో, తెలంగాణకు ఏది కావాలంటే అది చేస్తానని మోడీ హామీ ఇచ్చారు.
గతంలో కలిసినప్పుడు సమర్పించిన వినతి పత్రంలోని పలు హామీలను ఇప్పటికే అమలు చేశానని గుర్తు చేశారు. ఎన్టీపీసీ విద్యుత్తు ప్లాంటు, బయ్యారంలో ఉక్కు కర్మాగారం, ఉద్యానవన వర్సిటీ ఏర్పాటుకు కూడా ఇప్పటికే తాను చర్యలు చేపట్టానని మోడీ స్పష్టం చేశారు. తెలంగాణకు స్మార్ట్ సిటీలు కావాలని కేసీఆర్ కోరినప్పుడు, తెలంగాణకు ఎన్ని స్మార్ట్ సిటీలు కావాలంటే అన్ని ఇస్తామని, వాటికి ప్రతిపాదనలు పంపించాలని, అయితే, వాటి రూపకల్పనకు తాము ఆలోచన చేస్తున్నామని, మీకు కూడా ఏమైనా ఆలోచనలు ఉంటే అధికారులతో చర్చించి ప్రతిపాదనలు సమర్పించాలని కేసీఆర్కు సూచించారు.
అలాగే, ఇరు రాష్ట్రాల మధ్య ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పంపిణీని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కోరారు. తెలంగాణలో కేవలం 44 మంది ఐఏఎస్ అధికారులు మాత్రమే ఉన్నారని, దాంతో పని కుంటుపడుతోందని, తక్షణం పంపిణీ ప్రక్రియను ముగించాలని కేసీఆర్ కోరారు. వీలైనంత త్వరగా అఖిల భారత సర్వీసు అధికారుల పంపిణీ ప్రక్రియను పూర్తి చేస్తామని మోడీ హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేయాలని కేసీఆర్ కోరగా.. తెలుగు ప్రజలు అనవసరంగా ఘర్షణ పడవద్దని, సామరస్యంగా ఉండాలని, మంచిగా ముందుకు వెళ్లాలని, తెలుగు రాష్ట్రాల అభివృద్ధి జరగాలని మోడీ హితవు పలికారు. అందుకు కేసీఆర్ స్పందిస్తూ.. గవర్నర్ దగ్గర తానే చొరవ తీసుకుని చంద్రబాబు నాయుడితో చర్చించానని, చాలా సమస్యలను ఘర్షణ వాతావరణం లేకుండా పరిష్కరించుకుంటున్నామని, హైదరాబాద్ నగరంలో ఇప్పటి వరకూ ఒక్కరిపై కూడా ద్వేషపూరిత నేరం జరగలేదని చెప్పారు.