నరేంద్రమోడీ, అమిత్ షాకు షాకిచ్చేలా కేసీఆర్ వ్యూహం!!
కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్రమోడీ సర్కార్పై నిప్పులు చెరుగుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు జాతీయపార్టీ స్థాపించనున్నారంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలను విశ్లేషిస్తే ఆయన పార్టీ పెట్టే అవకాశాలు లేవని, కూటమివైపు మొగ్గుచూపుతున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఒకే వేదికమీదకు తీసుకురావడం సులభం
ప్రాంతీయ పార్టీలు ఆయా రాష్ట్రాల్లో బలంగా ఉన్నాయి. వీటిని ఒకవేదికమీదకు తీసుకువస్తే సరిపోతుందని, అలాకాకుండా రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తే అనుకూలంగా ఉన్న రాష్ట్రాల్లో పోటీచేయాల్సి వస్తుంది. ఎన్నికల సంఘం గుర్తింపు కోసం మూడు రాష్ట్రాల్లో చెప్పుకోదగ్గ సంఖ్యలో అసెంబ్లీ సీట్లు ఉండటంతోపాటు ఆరుశాతం ఓటింగ్ కచ్చితంగా ఉండి తీరాలి. అంతేకాకుండా త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోయేది గుజరాత్ రాష్ట్రం ఒకటే. వచ్చే ఏడాది మధ్యప్రదేశ్, కర్ణాటక ఎన్నికలున్నాయి. జాతీయ పార్టీని స్థాపించినా కర్ణాటక మినహా మిగతా రాష్ట్రాల్లో ప్రయోజనం ఉండదు.

స్పందిస్తున్న విపక్షాలు
కర్ణాటకలో పోటీచేయాలనుకున్నా అక్కడ అనుకూలంగా ఉన్న జేడీఎస్ కు ప్రతిబంధకంగా మారగూడదు. కేసీఆర్ ప్రస్తుతం ప్రాంతీయ పార్టీలతోపాటు రైతులు, రైతు సంఘాల ప్రతినిధులు, రైతుల సమస్యల కోసం ఆవిర్భవించిన రాజకీయపార్టీల నేతలతో చర్చిస్తున్నారు. నరేంద్రమోడీకి వ్యతిరేకంగా ఇచ్చిన పిలుపు మేరకు నితీష్ కుమార్ జేడీయూ, దేవగౌడ జేడీఎస్, ఆప్ స్పందించి మద్దతు తెలియజేశాయి. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆలోచనేమిటన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదు.

25న రానున్న తుదిరూపు
రాజకీయ పార్టీని స్థాపించడంకన్నా అన్ని రాష్ట్రాల్లో మోడీని వ్యతిరేకించే పార్టీలన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకురావడమే మంచిదన్న అభిప్రాయాన్ని టీఆర్ఎస్ కు చెందిన పలువురు నేతలు కూడా వ్యక్తం చేశారు. దీంతో ఆ దిశగానే కేసీఆర్ చర్యలు ఉండబోతున్నాయి. ఇప్పటికే ఆయన బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ను కలిశారు. దీనివెనక ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. మూడు రోజుల క్రితమే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి హైదరాబాద్ వచ్చి కేసీఆర్ ను కలిశారు. ఆప్ ఎప్పుడైనా సిద్ధంగానే ఉంది. ఈనెల 25న హర్యానాలో మాజీ ప్రధానమంత్రి దేవీలాల్ స్మారకార్థం ఇండియన్ నేషనల్ లోక్ దళ్ నిర్వహించే ర్యాలీకి హాజరుకాబోతున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిపక్ష పార్టీల నేతలందరినీ ఈ ర్యాలీకి ఆహ్వానించారు. తన కూటమికి ఆ తేదీని కేసీఆర్ వినియోగించుకోబోతున్నారని, మోడీకి వ్యతిరేకంగా కూటమికి తుదిరూపు అక్కడే పురుడుపోసుకోబోతందని టీఆర్ ఎస్ వర్గాలు తెలిపాయి.












Click it and Unblock the Notifications