కెసిఆర్ ప్లాన్: తెలంగాణ ఆగితే ఢిల్లీ నుంచే సమరం
న్యూఢిల్లీ: గత కొన్నాళ్లుగా ఢిల్లీలో మకాం వేసిన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కె. చంద్రశేఖర రావు జరగరానిది జరిగి తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం పొందకపోతే ఏం చేయాలనే విషయంపై మంతనాలు జరుపుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఢిల్లీ వెళ్లి తెలంగాణ రాష్ట్రంలోనే తిరిగి వస్తానని చెప్పి ఆయన ఢిల్లీకి వచ్చారు. తెలంగాణ బిల్లు కచ్చితంగా ఆమోదం పొందుతుందనే విశ్వాసంతో ఆయన ఉన్నారు. తన పార్టీ నాయకులకు కూడా అదే విశ్వాసం కల్పిస్తున్నారు.
ఈ నెల 19వ తేదీలోగా తెలంగాణ బిల్లు ఆమోదం పొందుతుందని, మూజువాణి ఓటుతోనైనా యుపిఎ ప్రభుత్వం తెలంగాణ బిల్లును ఆమోదింపజేస్తుందని ఆయన చెబుతున్నారు. ఒకవేళ తెలంగాణ బిల్లు ఆమోదం పొందకపోతే ఏం చేయాలనే విషయంపై ఆయన పార్టీ నాయకులతోనూ తెలంగాణ జెఎసి నాయకులతోనూ చర్చిస్తున్నారు.

తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్తో పాటు ఇతర నాయకులు కూడా ఢిల్లీలోనే ఉన్నారు. తెరాస నాయకులు కూడా పెద్దయెత్తున ఢిల్లీకి చేరుకున్నారు. బిజెపి తెలంగాణ నాయకులంతా ఢిల్లీలోనే మకాం వేసి, ఎట్టి పరిస్థితిలోనూ తెలంగాణ బిల్లు ఆమోదం పొందేలా చూడాలని తన జాతీయ నాయకులపై ఒత్తిడి తెస్తున్నారు.
ఇంత జరిగిన తర్వాత కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు సాకారం కాకపోతే ఢిల్లీ నుంచే సమరం ప్రారంభించాలనే ఎత్తుగడలో కెసిఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వ్యూహాన్ని కూడా ఆయన రచించుకుంటున్నట్లు చెబుతున్నారు. ఇందుకుగాను, తెరాస నాయకులు ఢిల్లీకి తరలి రావాలని కూడా సూచించారు. ఈలోగా తెలంగాణ బిల్లుకు మద్దతు కూడగట్టేందుకు ఎవరెవరిని కలవాలనే విషయంపై కూడా ఆలోచన చేస్తున్నారు. ఇది వరకే, ఓ విడత జాతీయ పార్టీల నాయకులను కలిసి మద్దతు కూడట్టారు.
కాగా, ఇదే సమయంలో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన తర్వాత కాంగ్రెసులో తెరాసను విలీనం చేసే విషయంపై కూడా మంతనాలు సాగిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ విషయం కూడా బిల్లు ఆమోదం పొందిన వెంటనే తేల్చేసేందుకు ఆయన సిద్ధపడినట్లు చెబుతున్నారు. బిజెపి మనసును మార్చేందుకు ఆయన ఏ విధమైన ప్రయత్నాలు చేస్తారనేది కూడా ఆసక్తికరంగానే ఉంది.












Click it and Unblock the Notifications