పార్టీలను ఏకం చేస్తాం- బీజేపీ ముక్త భారత్ లక్ష్యం : సీబీఐ జోక్యం పై కేసీఆర్ సీరియస్..!!
అన్ని ప్రతిపక్ష పార్టీలను ఏకం చేసి బీజీపీ ముక్త భారత్ దిశగా పని చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. బీహార్ సీఎం నితీష్ స్పష్టం చేసారు. అదే సమయంలో కేంద్ర విచారణ సంస్థల తీరు గురించి ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేసారు. శాంతి భద్రతలు రాష్ట్ర పరిధిలోని అంశమని..సీబీఐ జోక్యం చేసుకోకుండా బీహార్ చేస్తున్న ప్రయత్నిస్తున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని చెప్పారు. అన్ని రాష్ట్రాలు ఇదే పని చేయాలని సూచించారు.
మోదీ దేశ పరువు తీస్తున్నారు
తమది థర్డ్ ఫ్రంట్ కాదని..అసలైన ఫ్రంట్ అని చెబుతూ.. నాయకత్వం పైన ఇంకా చర్చ లేదన్నారు. దేశ వ్యాప్తంగా బీజేపీ అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అన్ని శక్తులు ఏకం కావాలని..బీజేపీ ముక్త భారత్ కోసం పని చేయాలని కేసీఆర్ - నితీష్ పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ ప్రపంచ దేశాల ముందు దేశ పరువు తీస్తున్నారని కేసీఆర్ మండిపడ్డారు. బీజేపీ పాలనలో దేశం నష్టపోయిందని..రొటీన్ ప్రభుత్వాలు వద్దని చెప్పారు. భారత్ ను మార్చే ప్రభుత్వం కావాలని చెప్పుకొచ్చారు. నిత్యవసర ధరలు భారీగా పెరిగాయని.. సహజ వనరులు ఉన్నా, సద్వినియోగం కావటం లేదని వివరించారు.
దేశం నష్టపోయిందంటూ
దేశ ప్రజలకు కనీసం తాగునీళ్లు ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రధాని మోదీ సర్కార్ ఉందని సీఎం కేసీఆర్ విమర్శించారు. ఎనిమిదేళ్ల మోదీ పాలనలో దేశం పూర్తిగా నష్టపోయిందని కేసీఆర్ ధ్వజమెత్తారు. మోదీ సర్కారును ఇంటికి పంపాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. సమాఖ్య వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని విమర్శించారు. దేశంలో వనరులు సమృద్ధిగా ఉన్నా.. వినియోగించుకోవట్లేదని తెలిపారు. మంచి దేశాన్ని నాశనం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రతిపక్షాలను కలుపుకుపోతాం
మేక్ ఇన్ ఇండియా నినాదం పేరుకు మాత్రమేనని.. వస్తువులు ఇతర దేశాల నుంచి దిగుమతి చేస్తున్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. అమెరికా వెళ్లి ట్రంప్ కు అనుకూలంగా ఎందుకు ప్రచారం చేయాల్సి వచ్చిందని..అవి అహ్మదాబాద్ ఎన్నికలు అనుకున్నారా అంటూ ఎద్దేవా చేసారు. తమతో కలిసి వచ్చే వారిని కలుపుకుంటామని.. రాని వారి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ నాయకత్వ తీరును బీహార్ సీఎం నితీష్ ప్రశంసించారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ ను వదులుకోరని చెప్పుకొచ్చారు.