సిక్కుల ఊచకోతపై కేజ్రీ, వ్యూహమే: 370పై సిఎం ఒమర్
న్యూఢిల్లీ/శ్రీనగర్: ఢిల్లీలో 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లలో తమ పార్టీకి చెందిన కొందరు నేతల ప్రమేయం ఉన్నట్లు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అంగీకరించిన తర్వాత ఈ అల్లర్లపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో దర్యాప్తు జరిపించాలని అకాలీదళ్, ఆమ్ ఆద్మీ పార్టీలు బుధవారం డిమాండ్ చేశాయి.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం ఉదయం లెఫ్టెనెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ను కలిసి ఈ అల్లర్లపై ప్రత్యేక దర్యాప్తు బృందం చేత దర్యాప్తు జరిపించాలని కోరుతూ ఒక వినతిపత్రం ఆయనకు సమర్పించారు. ఈ సమావేశం దాదాపు అరగంట సేపు జరిగిందని, మీ డిమాండ్ను పరిశీలిస్తానని, ప్రధాని మన్మోహన్ సింగ్కు తెలియజేస్తానని లెఫ్టెనెంట్ గవర్నర్ కేజ్రీవాల్కు హామీ ఇచ్చారని అధికార వర్గాలు తెలిపాయి.

మరోవైపు 1993లో ఢిల్లీ బాంబు పేలుళ్లలో దోషిగా తేలిన ఖలిస్థాన్ లిబరేషన్ ఫోర్సుకు చెందిన దేవేంద్రపాల్ పాంగ్ భుల్లార్కు విధించిన మరణ శిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలని కోరుతూ కేజ్రీవాల్ రాష్ట్రపతికి లేఖ రాశారు.
కాగా, అల్లర్లలో కాంగ్రెస్ పార్టీ నేతల పాత్ర ఉందని ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా అంగీకరించినందున వారిపై కూడా చర్యలు తీసుకోవాలని అకాలీదళ్ ఢిల్లీ విభాగం అధ్యక్షుడు మంజిత్ సింగ్ జికె విలేఖరులతో అన్నారు. తాము క్షమాపణ కోరడం లేదని అయితే 1984నాటి అల్లర్ల దోషులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నామని, ప్రత్యేక దర్యాప్తు బృందం చేత దర్యాప్తుకు తాము డిమాండ్ చేస్తున్నామని ఆయన చెప్పారు.
వ్యూహాత్మకమా?
సిక్కుల ఊచకోతపై సిట్ విచారణ కేజ్రీవాల్ వ్యూహాత్మకమా అంటే అవుననే అంటున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలలో పంజాబ్, హర్యానా ప్రాంతాల్లో అత్యధిక స్థానాల్లో పోటీ చేసి గెలిచేందుకు ఎఎపి ఉవ్వీళ్లూరుతోంది. ఈ కారణంగానే సిక్కుల ఊచకోత అంశాన్ని లేవనెత్తారంటున్నారు. మరోవైపు ఎఎపి విరాళాలకు సంబంధించి తాము అడిగిన సమాచారాన్ని కేజ్రీవాల్ సహా ఎఎపి నేతలు ఎవరు ఇవ్వలేదని ఓ కేసు విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టుకు కేంద్రం తెలిపింది.
ఎవరు రద్దు చేయలేరు: ఒమర్
జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదాను కట్టబెడుతున్న రాజ్యాంగంలోని 370వ అధికరణను ఏ ప్రధానమంత్రి రద్దు చేయలేరని జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా అన్నారు. బిజెపి ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ ప్రధాని అవుతారన్న ఆందోళన ఉందా అని ప్రశ్నిస్తే.. ఆయన నేరుగా బదులివ్వలేదు.
మోడీ ప్రధానమంత్రి అవుతారా లేక రాష్ట్రపతి అవుతారా లేక మరేదైన పదవి చేపడతారా అన్నది విషయం కాదన్నారు. కాశ్మీర్ వివాదానికి శాశ్వత పరిష్కారం లభించేలా ఇటీవల పాకిస్తాన్ తీసుకున్న చర్యలకు సంబంధించి ఎలాంటి ఆధారం లేదన్నారు. నియంత్రణ రేఖ వద్ద పాకిస్తాన్ ఉగ్రవాదులకు నిరంతరం సహకరిస్తోందని ఆరోపించారు.












Click it and Unblock the Notifications