కేజ్రీవాల్ బయటివ్యక్తి కాదు, ఢిల్లీ ఎన్నికల్లో పోటీ చేయవచ్చు: ఈసీ
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్కు ఎన్నికల కమిషన్ ఊరటనిచ్చింది. అతను బయటి వ్యక్తి కాదని, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయవచ్చని స్పష్టం చేసింది. అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ఓటరేనని, తద్వారా అతను ఢిల్లీ ఎన్నికల్లో పాల్గొనేందుకు అర్హుడని ఎన్నికల కమిషన్ వెల్లడించింది.
ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీకి చెందిన వ్యక్తి కాదని, ఆయన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హుడు కాడని కాంగ్రెస్ అభ్యర్ధి కిరణ్ వాలియా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఉత్తర ప్రదేశ్ స్ధానికత ఉన్న వ్యక్తి ఢిల్లీలో ఎలా పోటీ చేస్తారని తన పిటిషన్లో పేర్కొన్నారు.
ఈ విషయమై ఢిల్లీ హైకోర్టు తన అభ్యర్ధిత్వాన్ని ఎందుకు రద్దు చేయకూడదో తెలపాలంటూ అరవింద్ కేజ్రీవాల్కు నోటీసులు పంపడంతో పాటు, ఎన్నికల కమిషన్ స్పందన కూడా కోరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ స్పందించింది.
ఫిబ్రవరి 7న ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 10న ఓట్ల లెక్కింపు జరగనుంది.