చంద్రబాబు డిమాండ్ ను జగన్ వినలేదు... చివరికి కేజ్రివాల్ నెరవేర్చాడిలా...
కరోనా వైరస్ కారణంగా దేశవ్యాప్తంగా అన్ని రంగాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. వివిధ రాష్ట్రాల్లో పనికి దూరమైన కార్మికుల పరిస్ధితి మరీ దారుణంగా ఉంది. ఏపీలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న కార్మికులు, వలస కూలీలను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని, వారికి ఐదువేల సాయం అందించాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఎప్పటినుంచో కోరుతున్నారు. అయితే జగన్ సర్కార్ మాత్రం దీనిని ఏమాత్రం పట్టించుకోలేదు.

జగన్ సర్కారుకు చంద్రబాబు డిమాండ్...
ఏపీలో కరోనా వైరస్ కారణంగా లాక్ డౌన్ విధించిన తర్వాత వలస కూలీలు, కార్మికులకు రోజు గడవడమే కష్టమైపోతోంది. లాక్ డౌన్ ఆరంభ దశలో వీరికి కాస్తో కూస్తో నిత్యావసరాలు సరఫరా చేసిన రాజకీయ నేతలు... ఆ తర్వాత మోహం చాటేస్తున్నారు. దీంతో వీరు ఆకలితో అలమటిస్తున్నారు. ఇలాంటి వారికి ఐదు వేల రూపాయలు ఏపీలోని వైసీపీ ప్రభుత్వం సాయం చేయాలని విపక్ష టీడీపీ ఎప్పటినుంచో కోరుతోంది. టీడీపీ నేతలంతా ఇదే డిమాండ్ తో ఇంట్లోనే దీక్షలు చేయాలని అధినేత చంద్రబాబు సూచించారు కూడా. అయితే ఎన్ని దీక్షలు చేసినా, డిమాండ్లు చేసిన సీఎం జగన్ మాత్రం ఈ డిమాండ్ ను పట్టించుకోలేదు.

కేజ్రివాల్ సర్కారు సాయం...
కరోనా వైరస్ వ్యాప్తితో దేశ రాజధాని ఢిల్లీ అతలాకుతలం అవుతోంది. భారీగా నమోదవుతున్న కేసులతో రాజధానిలో కార్యకలాపాలు అన్నీ పూర్తిగా నిలిచిపోయాయి. రోజు కూలీ చేసుకునే జనం ఆకలితో అలమటిస్తున్నారు. దీంతో లాక్ డౌన్ కారణంగా ఇబ్బందుల్లో ఉన్న దాదాపు 40 వేల మంది భవన నిర్మాణ రంగ కార్మికులను ఆదుకోవాలని ఢిల్లీలో డిమాండ్లు వస్తున్నాయి. వీటిపై తాజాగా ఢిల్లీలోని కేజ్రివాల్ ప్రభుత్వం స్పందించింది. భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు ఐదు వేల రూపాయల చొప్పున సాయం అందించాలని సీఎం కేజ్రివాల్ నిర్ణయించారు. వీరి పేర్ల నమోదు కోసం ప్రత్యేక వెబ్ సైట్ ను కూడా ప్రారంభించనున్నట్లు కేజ్రివాల్ ప్రకటించారు.
Recommended Video

ఏపీలో జగన్ సర్కారు....
ఢిల్లీలో కేజ్రివాల్ సర్కారు తాము ఏపీలో చేసిన డిమాండ్ నెరవేర్చేందుకు సిద్ధమవుతుండగా... ఇక్కడ సీఎం జగన్ మాత్రం ముందుకు రావడం లేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే ఏపీ ప్రభుత్వం మాత్రం నెలకు మూడు విడతలు ఉచిత రేషన్, ఓసారి వెయ్యి రూపాయల సాయం పేదలకు అందించింది. ప్రస్తుతం అప్పుల్లో ఉన్న ఖజానాను దృష్టిలో పెట్టుకుని చూస్తే ఉద్యోగుల జీతాలకు సైతం డబ్బులు లేవు. కాబట్టి ప్రభుత్వం చంద్రబాబు డిమాండ్ పై స్పందించే పరిస్ధితి లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.












Click it and Unblock the Notifications