కేజ్రీవాల్ నిరసన: లేడీస్ టాయిలెట్లో ఆప్ మంత్రి
న్యూఢిల్లీ: కొంత మంది పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఆయన అనుచరులు ధర్నా చేస్తున్న సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఢిల్లీ మంత్రి సోమనాథ్ భారతి లేడీస్ టాయిలెట్ వాడడం వివాదంగా మారింది.
ఢిల్లీ న్యాయశాఖ మంత్రి భారతి మంగళవారంనాడు ప్రెస్ క్లబ్లోని లేడీస్ టాయిలెట్ నుంచి బయటకు వస్తూ కనిపించారు. దాంతో మహిళా జర్నలిస్టులు బయట వేచి చూడాల్సి వచ్చింది. పురుషుల టాయిలెట్ పక్కనే ఉన్నప్పటికీ ఆయన లేడీస్ టాయిలెట్లోకి వెళ్లారని మీడియా వార్తాకథనాలు తెలియజేస్తున్నాయి.
ఎన్డీటివి కథనం ప్రకారం - ఆమ్ ఆద్మీ పార్టీ ధర్నా కార్యక్రమానికి సంబంధించిన వార్తలను సేకరించడానికి వచ్చిన మహిళా జర్నలిస్టులు భారతి వాష్రూమ్ను వాడుతుండడంతో బయట వేచి ఉన్నారు. వారు ఆయనను అడగడానికి ప్రయత్నించారు. అయితే, ఆయన మారుమాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు.
పబ్లిక్ టాయిలెట్లను ఆందోళనకారులు వాడకుండా పోలీసులు చూస్తున్నారని అరవింద్ కేజ్రీవాల్ అంతకు ముందు విమర్సించారు. పరిసరాల్లోని టాయిలెట్లను అన్నింటినీ పోలీసులు మూసివేయించారని ఆయన ఆరోపించారు.