ట్విస్ట్, డబుల్ స్టాండ్: లగ్జరీ బంగ్లాపై కేజ్రీవాల్ డ్రామా?
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ సమన్వయకర్త, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ 'లగ్జరీ బంగ్లా' అంశంలో ట్విస్ట్! ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం కొద్ది రోజులకు కేజ్రీవాల్కు లగ్జరీ బంగ్లా కేటాయించగా, దానికి ఆయన విముఖత చూపినట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, బంగ్లా విషయంలో కేజ్రీవాల్ డ్రామా వెలుగులోకి వచ్చిందని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
కేజ్రీవాల్కు లగ్జరీ బంగ్లా కేటాయించడం కంటే ముందే అతను రెండు లగ్జరీ బంగ్లాలు కావాలని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన 48 గంటల్లో కోరారంటున్నారు. ఢిల్లీలోని భగవాన్ దాస్ ప్రాంతంలో ఉన్న ఆ రెండు బంగ్లాలు కావాలని కేజ్రీవాల్ కోరినట్లుగా తెలుస్తోంది. బంగ్లాలు ఆయనకు అలాట్ చేయబడలేదని, ముందే అడిగారని అంటున్నారు.

కొద్ది రోజుల క్రితం కేజ్రీవాల్కు కొత్త బంగ్లాలు కేటాయించడం చర్చకు దారి తీసిన విషయం తెలిసిందే. ఆమ్ ఆద్మీ నినాదమని చెబుతున్న కేజ్రీవాల్ లగ్జరీ బంగ్లాలోకి ఎలా వెళ్తారంటూ పలువురు ప్రశ్నించారు. దీంతో ఆయన వెనక్కి తగ్గారు. తనకు ఆ బంగ్లా అవసరం లేదని చెప్పారు. మొదట ఆ బంగ్లాలోకి మారుదామనుకున్న కేజ్రీవాల్ విమర్శల నేపథ్యంలో వెనక్కి తగ్గారని వార్తలు వచ్చాయి.
కాగా, బంగ్లాల పైన కొత్త వాదన తెర పైకి రావడంతో కేజ్రీవాల్ వాటిని ఎందుకు కోరారో తెలుసుకొని, వివరణ ఇచ్చే పనిలో పలువురు ఎఎపి నేతలు పడ్డారట. ఎఎపికి మద్దతుదారు అయిన మేథా పట్కర్ మాట్లాడుతూ... ముఖ్యమంత్రిగా తనకు కొన్ని అవసరాలు తప్పకుండా ఉంటాయని కేజ్రీవాల్ గుర్తించారని చెబుతున్నారు. ప్రజలు కేజ్రీవాల్ తీరును గమనిస్తున్నారని కాంగ్రెసు నేత అమృతా దావన్ చెప్పారు.












Click it and Unblock the Notifications