కేంద్రీయ విద్యాలయ సంఘటన్ కీలక నిర్ణయం- కోవిడ్ అనాథలకు ఫ్రీ సీట్లు
దేశవ్యాప్తంగా మారుతున్న పరిస్ధితుల్ని దృష్టిలో ఉంచుకుని కేంద్రీయ విద్యాలయాల్ని నడిపిస్తున్న సంస్ధ కేంద్రీయ విద్యాలయ సంఘటన్ కీలక నిర్ణయాలుతీసుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం చేసిన సూచన మేరకు కేవీల్లో ఎంపీ సీట్ల కోటాను తాజాగా ఎత్తేసిన సంఘటన్.. ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుంది.
కోవిడ్ కారణంగా తల్లితండ్రుల్ని కోల్పోయి అనాధలుగా మిగిలిన వారికి కేవీల్లో ఉచితంగా సీట్లు ఇవ్వాలని కేంద్రీయ విద్యాలయసంఘటన్ నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ పీఎం కేర్స్ పథకం అమల్లో భాగంగా ఈ మేరకు వారికి సీట్లు కేటాయించాలని కేంద్రీయ విద్యాలయ సంఘటన్ కు సూచించింది. దీంతో కేవీ సంఘటన్ ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది. గత రెండేళ్లలో కోవిడ్ -19 మహమ్మారి కారణంగా తల్లిదండ్రులిద్దరినీ కోల్పోయిన పిల్లలకు ఉచిత ప్రవేశం కల్పించాలని కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (కెవిఎస్) నిర్ణయించిందని అధికారులు తెలిపారు. పీఎం కేర్స్ ఫర్ చిల్డ్రన్ స్కీమ్ కింద దేశవ్యాప్తంగా అలాంటి పిల్లలకు అడ్మిషన్లు ఇవ్వాలని కేవీఎస్కు కేంద్రం ఆదేశాలు ఇచ్చింది.
పీఎం కేర్స్ ఫర్ ఛిల్డ్రన్ పథకం ఈ పిల్లల సమగ్ర సంరక్షణ మరియు రక్షణకు భరోసా ఇవ్వడంతో పాటు ఆరోగ్య బీమా ద్వారా వారి శ్రేయస్సును చూడటం, విద్య ద్వారా వారిని శక్తివంతం చేయడం, 23 ఏళ్లకు చేరుకున్నప్పుడు ఆర్థిక సహాయంతో స్వయం సమృద్ధి కోసం వారిని సన్నద్ధం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది.ఈ పిల్లల్ని వారి వయస్సు ప్రకారం వివిధ తరగతులలో చేరుస్తారు. అలాగే వారి అడ్మిషన్ సంబంధిత తరగతుల బలం కంటే ఎక్కువగా ఉంటుందని కేవీఎస్ అధికారులు తెలిపారు. వారికి 1వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉచితంగా విద్య అందించనున్నారు. ఇందులో వారికి ట్యూషన్ ఫీజు, విద్యా వికాస్ నిధి ఛార్జీలు మొదలైన వాటి నుంచి కూడా మినహాయింపు ఉంటుంది.
అయితే ఈ కేటగిరీ కింద అడ్మిషన్ సంబంధిత జిల్లా జిల్లా మేజిస్ట్రేట్ సిఫార్సుపై సంబంధిత కేవీ ద్వారా ఇస్తారు. ఒక్కో తరగతికి ఇద్దరు విద్యార్థులతో పాటు ఒక్కో పాఠశాలకు గరిష్టంగా 10 మంది విద్యార్థులను కలెక్టర్ సిఫార్సు చేయవచ్చని అధికారులు తెలిపారు.