స్వప్నా సురేష్..గోల్డ్ స్మగ్లింగ్ కేసు: సీబీఐ ఎంట్రీపై నిషేధం: కేబినెట్ కీలక నిర్ణయం
తిరువనంతపురం: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు వ్యవహారం అనూహ్యంగా మలుపు తిరిగింది. స్వప్నా సురేష్ సహా ముఖ్యమంత్రి కార్యాలయం మాజీ ముఖ్య కార్యదర్శి శివశంకర్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు అదుపులో తీసుకున్న వేళ.. కేరళ ప్రభుత్వం సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐపై నిషేధాన్ని విధించింది. సీబీఐ అధికారుల విచారణలను బ్రేక్ వేసింది.
తమ అనుమతి లేనిదే రాష్ట్రంలో ప్రవేశించకూడదని, ఎలాంటి దర్యాప్తులను చేపట్టరాదని ఆదేశించేలా ఉత్తర్వులను జారీ చేయనుంది. బుధవారం సచివాలయంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు ఈ నిర్ణయాన్ని తీసుకుంది ప్రభుత్వం. ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధ్యక్షతన కేబినెట్ భేటీ కొనసాగింది. ఈ సందర్భంగా అనేక అంశాలపై మంత్రివర్గం చర్చిచింది. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో చోటు చేసుకుంటోన్న పరిణామాలు రాష్ట్ర ప్రభుత్వానికి తలవంపులకు గురి చేస్తున్నాయని మంత్రులు ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
స్వప్నా సురేష్ వ్యవహారం రాష్ట్ర ప్రతిష్ఠను దిగజార్చేలా మారిందన అభిప్రాయపడింది. ఈ కేసులో కొన్ని పెద్ద తలకాయల ఉన్నట్లు వస్తోన్న వార్తాలు రావడం, సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలు విచారణను చేపట్టడం వల్ల ప్రతిష్ఠ మసకబారుతోందనే ఆందోళనను మంత్రులు వ్యక్తం చేశారు. అదే సమయంలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం రాజకీయ ప్రత్యర్థులపై సీబీఐ, ఈడీ, ఆదాయపు పన్ను వంటి విభాగాలను ప్రయోగిస్తోందని మంత్రులు అభిప్రాయపడ్డారు.
దీన్ని నివారించడానికి సీబీఐ ప్రవేశాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. దీనికి ముఖ్యమంత్రి పినరయి విజయన్ సానుకూలంగా స్పందించారు. సీబీఐ ఎంట్రీపై ప్రస్తుతం కొనసాగుతోన్న జనరల్ కన్సెంట్ను ఉపసంహరించుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు కేబినెట్లో ఓ తీర్మానాన్ని రూపొందించారు. దీనికి ముఖ్యమంత్రి ఆమోదించారు. వెంటనే ఆదేశాలను జారీ చేయాలని ఆయన అధికారులకు సూచించారు. ఇకపై ఎలాంటి కేసులకు సంబంధించిన దర్యాప్తును కొనసాగించాలంటే.. ఆ కేసు పూర్తి వివరాలను తొలుత హోం మంత్రిత్వ శాఖ అధికారులను అందజేయాల్సి ఉంటుంది. ప్రభుత్వం అనుమతి ఇస్తేనే.. రాష్ట్రంలో సీబీఐ అడుగు పెట్టబోదని ప్రభుత్వం తెలిపింది.