కేరళ సీఎం పినరయి విజయన్కు కరోనా పాజిటివ్
తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కరోనా బారినపడ్డారు. తనకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయినట్లు ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. చికిత్స నిమిత్తం కోజికోడ్ వైద్య కళశాలలో చేరుతున్నట్లు తెలిపారు. ఇటీవల తనని కలిసినవారంతా కరోనా పరీక్షలు చేయించుకుని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు.
కాగా, మార్చి 3న విజయన్ కరోనా టీకా తొలి డోసు వేసుకున్నారు. ఇటీవల సీఎం విజయన్ కుమార్తె వీణకు కూడా కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 6న జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో పీపీఈ కిట్ ధరించిన ఆమె పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.
కేరళలో గత కొంత కాలంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో 63,901 కరోనా నమూనాలను పరీక్షించగా 4353 కేసులు వచ్చాయి. వీటిలో అత్యధికంగా ఎర్నాకుళంలో 654 కొత్త కేసులు నమోదు కాగా, కోజికోడ్లో 453, తిరువనంతపురంలో 234, త్రిస్సూర్లో 393, మలప్పురంలో 359, కన్నూరులో 334 చొప్పున కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 18 మంది మృతి చెందడంతో ఇప్పటి వరకు కరోనా మరణాల సంఖ్య 4728కి చేరింది. కేరళ రాష్ట్రంలో ప్రస్తుతం 33,261 యాక్టివ్ కేసులున్నాయి.
I have been confirmed Covid +ve. Will get treated at the Government Medical College, Kozhikkode. Request those who have been in contact with me recently to go into self observation.
— Pinarayi Vijayan (@vijayanpinarayi) April 8, 2021
కేరళలో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. అధికార ఎల్డీఎఫ్, ప్రతిపక్ష యూడీఎఫ్ మధ్యే ప్రధాన పోటీ ఉన్నప్పటికీ.. భారతీయ జనతా పార్టీ కూడా తమదే అధికారం అంటూ ప్రచారంలో దూసుకెళుతోంది. మే 2న అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. కాగా, ప్రీపోల్ సర్వేలు పినరయి విజయన్ సర్కారే మరోసారి అధికారంలోకి వస్తుందని వెల్లడించాయి.