మోదీకి భారీ షాక్ :రాష్ట్రాల సిండికేట్ -వ్యాక్సిన్ల కోసం బీజేపీయేతర 11 సీఎంల ఐక్యత -విజయన్ సంచలన లేఖలు
దేశంలో కరోనా విలయం ఫెడరల్ స్ఫూర్తిని కూడా దెబ్బతీసింది. కొవిడ్ వ్యాక్సిన్ల విషయంలో కేంద్రంలోని మోదీ సర్కార్ అనుసరిస్తోన్న అసంబద్ధ విధానాలను వ్యతిరేకిస్తూ రాష్ట్రాలకు రాష్ట్రాలే సిండికేట్గా ఏర్పడే పరిస్థితులు తలెత్తాయి. 'అమ్మ పెట్టదు.. అడుక్కు తిననీయదు' తరహాలో వ్యాక్సిన్లను ఇ్వకపోగా, రాష్ట్రాలు సొంతగా సమకూర్చుకోడానికి కూడా అడ్డంపడుతోన్న కేంద్రాన్ని కలిసికట్టుగా నిలదీసి, నిలువరిద్దామంటూ బీజేపీ యేతర 11 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కేరళ సీఎం పినరయి విజయన్ సంచలన పిలుపునిచ్చారు.

వ్యాక్సిన్ల కోసం ఒక్కటవుదాం
కరోనా రెండో దశ విలయం అన్ని రాష్ట్రాలపైనా తీవ్ర ప్రభావాన్ని చూపిందని, ఈ గండం నుంచి గట్టెక్కే మార్గం సంపూర్ణ వ్యాక్సినేషన్ ఒక్కటే అన్నది నిర్వివాదాంశమని, దురదృష్టవశాత్తూ వ్యాక్సిన్ల విషయంలో కేంద్రం వైఖరి అతి దారుణంగా ఉందని కేరళ సీఎం పినరయి విజయన్ ఆరోపించారు. ఫెడరల్ స్ఫూర్తిని కేంద్రం విస్మరించినప్పటికీ, దాన్ని నిలబెట్టుకునే బాధ్యతను రాష్ట్రాలుగా తలకెత్తుకుందామని, దేశంలో ప్రతి ఒక్కరికీ ఉచితంగా వ్యాక్సిన్లు అందేలా, వ్యాక్సిన్ల సేకరణకు సహకరించేలా కేంద్రంపై ఒత్తిడి తెద్దామని, ఆ మేరకు ఒక్కటిగా పోరాడుదామని విజయన్ పిలుపునిచ్చారు..

జగన్, కేసీఆర్ సహా 11 మందికి..
ఉచిత వ్యాక్సిన్ల కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తూనే టీకాల సేకరణకు కలిసికట్టుగా ప్రయత్నిద్దామంటూ పినరయి విజయన్ 11 రాష్ట్రాల సీఎంలను కోరారు. దేశ జనాభాలో అతి పెద్ద గ్రూపయిన '18 నుంచి 44 ఏళ్ల వయసు' వారికి టీకాలు ఇచ్చే బాధ్యతను రాష్ట్రాలపైకే నెట్టేసిన కేంద్రం.. ఆ మేరకు వ్యాక్సిన్లను సరఫరా చేయకపోవడంతో దేశంలో దాదాపు సంక్షోభ పరిస్థితులు తలెత్తడం చూస్తున్నదే. ఈ పరిస్థితుల్లో ఏపని చేసినా ఐక్యంగా చేద్దామంటూ తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్, తమిళనాడు సీఎం స్టాలిన్, ఒడిశా నవీన్ పట్నాయక్, బెంగాల్ మమతా బెనర్జీ, రాజస్థాన్ అశోక్ గెహ్లాట్, ఛత్తీస్గఢ్ భూపేష్ భగేల్, పంజాబ్ కెప్టెన్ అమరీందర్ సింగ్, జార్ఖండ్ హేమంత్ సోరెన్, మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేలకు కేరళ సీఎం విజయన్ సోమవారం లేఖలు రాశారు.

జాతీయ టీకా విధానం ఆగమాగం
కొవిడ్ ఉధృతిలోనూ టీకాల వ్యవహారం అస్తవ్యస్థంగా, అసంబద్ధంగా ఉండటాన్ని సుప్రీంకోర్టు తప్పుపట్టింది. ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్లకు వేర్వేరు ధరలు నిర్ణయించడం, కేంద్రానికి, రాష్ట్రాలకు వేర్వేరు ధరల్లో విక్రయించడాన్ని కోర్టు గర్హించింది. జాతీయ టీకా విధానం ఇంత లోపభూయీష్టంగా ఉండటమేంటని మోదీ సర్కారును కోర్టుల తలంటింది. వ్యాక్సిన్ల సేకరణ కోసం విదేశీ ఫార్మా కంపెనీలను రాష్ట్రాలు విడివిడిగా సంప్రదించినప్పటికీ.. భారత్ లో ప్రస్తుతం నెలకొన్న 'కేంద్రం వర్సెస్ రాష్ట్రాలు' గొడవల్లోకి తలదూర్చకుండేలా టీకాలు సరఫరా చేయలేమంటూ ఆ సంస్థలు చేతులెత్తేస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీయేతర రాష్ట్రాలు ఒక్కటవుదామంటూ విజయన్ ఇచ్చిన పిలుపు ఎటువైపునకు దారి తీస్తుందో, దీనిపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి..












Click it and Unblock the Notifications