"మోడీ గద్దె దిగేదాక.. అరగుండుతోనే ఉంటా.."
తన డబ్బును మోడీ బూడిద పాలయ్యేలా చేశారని, అలాంటి వ్యక్తి గద్దె దిగేవరకు తాను అరగుండుతోనే ఉంటానని యహక్కక ఆవేదన చెందుతున్నాడు.
తిరువనంతపురం: ప్రధాని మోడీ నోట్ల రద్దు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ.. కేరళకు చెందిన ఓ ఛాయ్ వాలా ప్రతినబూనాడు. మోడీ గద్దె దిగిపోయేంతవరకు తాను అరగుండుతోనే ఉంటానని, తన తలపై ఏమాత్రం వెంట్రుకలు పెరగనివ్వనని ప్రతిజ్ఞ చేశాడు. ఇంతకుముందు బట్టతలతో పాటు కొద్దిపాటి వెంట్రుకలతో కనిపించిన సదరు ఛాయ్ వాలా ఇకనుంచి అరగుండుతోనే కనిపిస్తానని చెబుతున్నాడు.
ఇంతకీ ఎవరా ఛాయ్ వాలా అంటే.. కేరళకు చెందిన 70ఏళ్ల యహియా. కస్టమర్లంతా యహక్కక అని పిలుస్తుంటారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత తనకు ఎదురైన కష్టాలతో తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడు యహక్కక. కొత్త నోట్ల కోసం ప్రయత్నించే క్రమంలో.. అనారోగ్యం బారిన కూడా పడ్డాడు. నోట్ల రద్దు నాటి నుంచి తన ఎదుర్కొన్న కష్టాలన్నింటిని కేరళ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ అష్రాఫ్ కాదక్కల్ తో పంచుకున్నాడు. ఆ తర్వాత కాదక్కల్.. యహక్కక కష్టాల గురించి ఫేస్ బుక్ లో పోస్టు చేయడంతో.. ప్రస్తుతం యహక్కక పడ్డ కష్టాల గురించి కేరళ అంతటా చర్చించుకుంటున్నారు.
ఫేస్ బుక్ లో పోస్టు చేసిన వివరాలు :
'నా పేరు యహియా. తెలిసినవారు యహి అని, కస్టమర్లు యహక్కక అని పిలుస్తుంటారు. వయసు 70ఏళ్లు. సొంతూరు కొల్లాం జిల్లాలోని కొడక్కల్ ముక్కున్నమ్. నాకు భార్య, ఇద్దరు కుమార్తెలు. పుట్టుకతో పేదవాన్ని. చదువు కూడా లేదు. కుటుంబ పోషణ కోసం కూలి పనులు చేశాను. గల్ఫ్ కు కూడా వెళ్లొచ్చా. చివరకు ఓ చిన్న టీ స్టాల్ పెట్టుకుని బ్రతుకుతున్నా. కుమార్తె పెళ్లి చేయడానికి చాలా కష్టాలు పడాల్సి వచ్చింది.'

'బ్యాంకులో లోన్ తీసుకుని, చేతిలో ఉన్న కొంత డబ్బుతో కుమార్తె పెళ్లి జరపించాను. హోటల్ నిర్వహణ మొత్తం నేనే చూసుకుంటాను. వంటపని, వడ్డించే పని, హోటల్ శుభ్రపరిచే పని మొత్తం నాదే. అందుకే హోటల్ లో నైటీనే వేసుకుంటా. మోడీ నోట్ల రద్దు చేశారని తెలిసి షాక్ కు గురయ్యాను. కష్టపడి కూడబెట్టుకున్న డబ్బు రూ.23వేల దాకా ఉంది. అన్ని పెద్ద నోట్లే.. వీటిని మార్చుకుందామని రెండు రోజులు బ్యాంకు క్యూ లో నిలబడితే.. రెండో రోజు బీపీ డౌన్ అయి పడిపోయాను.'
'దయాగుణం కలిగిన వ్యక్తులు జాలితో నన్ను ఆసుపత్రిలో చేర్పించారు. కో-ఆపరేటివ్ బ్యాంకులో లోన్ తీసుకున్నా.. నాకు బ్యాంకు ఖాతా లేదు. ఇప్పుడు నోట్లనెలా మార్చుకోవాలో తెలియడం లేదు. ఎన్నిరోజులని బ్యాంకుల ముందు నిలుచోవాలి. పగలనక రాత్రనక కష్టపడి సంపాదించుకున్న డబ్బు చెల్లకుండా పోయింది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యి ఇంటికి వెళ్లాక రూ.23వేలను కాల్చివేశాను. ఆ వెంటనే సమీపంలోని బార్బర్ షాపుకు వెళ్లి అరగుండు చేయించుకున్నాను'
అంటూ తన గోడు వెల్లబోసుకున్నాడు.
తన డబ్బును మోడీ బూడిద పాలయ్యేలా చేశారని, అలాంటి వ్యక్తి గద్దె దిగేవరకు తాను అరగుండుతోనే ఉంటానని యహక్కక ఆవేదన చెందుతున్నాడు. మోడీ గద్దె దిగాకనే వెంట్రుకలను పెంచుకుంటానని స్పష్టం చేశాడు.












Click it and Unblock the Notifications