కేరళకు రిలయన్స్ ఫౌండేషన్ భారీ విరాళం: సీఎంఆర్ఎఫ్కు 21కోట్లు, రూ.51కోట్ల విలువైన వస్తువులు
Recommended Video
ముంబై/తిరువనంతపురం: భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన కేరళను ఆదుకునేందుకు రిలయన్స్ ఫౌండేషన్ భారీ ఆర్థికసాయంతో ముందుకు వచ్చింది. కేరళ సీఎం రిలీఫ్ ఫండ్కు రూ.21కోట్లు విరాళంగా అందజేసింది.
అంతేగాక, రూ.51కోట్ల విలువైన వస్తువులను వరద బాధితులకు పంపిణీ చేయనున్నట్లు రిలయన్స్ ఫౌండేషన్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్లో భాగమైన రిలయన్స్ రిటైల్, జియో సహకారంతో వరద బాధితులకు అన్ని విధాలుగా సహకారం అందిస్తున్నామని తెలిపింది.
వరద బాధిత ప్రాంతాల్లో ఇప్పటికే తమ ఫౌండేషన్ సహాయక చర్యలు ప్రారంభించిందని వెల్లడించింది. ఆగస్టు 14 నుంచి వయనాడ్, త్రిసూర్, అళప్పుజ, ఎర్నాకుళం సహ పలు జిల్లాల్లో తమ వాలంటీర్లు పనిచేస్తున్నారని తెలిపింది.
కేరళలోని 160 ప్రభుత్వ పునరావాస కేంద్రాల్లోని బాధితులకు రిలయన్స్ రిటైల్ తరపున ఆహార పదార్థాలు, గ్లూకోజ్, శానిటరీ న్యాప్కిన్స్, ఇతర నిత్యావసర వస్తువులు అందిస్తున్నట్లు వెల్లడించింది. కేరళలో వారం రోజులపాటు ఉచిత వాయిస్, డేటా సేవలను కూడా అందించనున్నట్లు రిలయన్స్ జియో ప్రకటించింది. వరదల కారణంగా కుటుంబసభ్యులకు దూరమైన వారి ఆచూకీ కనుగొనేందుకు టోల్ ఫ్రీ నెంబర్ 1800-893-9999 ను కూడా ఏర్పాటు చేసింది జియో.