అసలు దొంగలు దుబాయ్ అధికారులే.. బాంబు పేల్చిన స్వప్న సురేశ్.. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో మరో సంచలనం..
ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైన కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో మరో సంచలన పరిణామాం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా భావిస్తోన్న స్వప్న సురేశ్ ఎట్టకేలకు నోరు విప్పారు. డిప్లొమాటిక్ బ్యాగేజీలో భారీ ఎత్తున బంగారాన్ని అక్రమంగా తరలించిన వ్యవహారంలో అసలు దొంగలు యూఏఈ రాయబార కార్యాలయం అధికారులేనని, ఇందులో తన పాత్ర చాలా పరిమితమంటూ బాంబు పేల్చారు. దీంతో ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి వెళ్లిన ఈ కేసు అనూహ్య మలుపు తిరిగినట్లయింది.

బెయిల్ పిటిషన్..
కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ప్రధాన కుట్రదారుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న స్వప్న సురేశ్(36) కేరళ హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం తిరువనంతపురం ఎయిర్ పోర్టులో డిప్లొమాటిక్ బ్యాగేజీలో 30 కేజీల బంగారం పట్టుపడినప్పటి నుంచి పరారీలో ఉన్న ఆమె.. తన లాయర్ల ద్వారా కోర్టును ఆశ్రయించారు. హైకోర్టులో వేసిన పిటిషన్ లో గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారానికి సంబంధించి పలు సంచలన విషయాలను ఆమె పేర్కొన్నారు.

దుబాయ్ అధికారులు చెబితేనే..
2016 నుంచి 2019 వరకు తాను యూఏఈ కాన్సులేట్(తిరువనంతపురం)లో పని చేసిన మాట వాస్తవమని, అయితే ఉద్యోగం మానేసిన తర్వాత కూడా దుబాయ్ అధికారులు తనను పనుల కోసం వాడుకుంటున్నారని, ప్రధానంగా యూఏఈ కాన్సులేట్ జనరల్ అసిస్టెంట్ కమిషనర్ రషీద్ ఖాసిం అలి తరచూ ఫోన్లు చేసి పనులు పురమాయించేవాడని, కొవిడ్-19 అవేర్నెస్ కార్యక్రమంలోనూ తనను ఇన్వాల్వ్ చేశారని స్వప్న సురేశ్ తన బెయిల్ పిటిషన్ లో పేర్కొన్నారు. డిప్లొమాటిక్ బ్యాగేజీ విషయంలోనూ అధికారి రషీద్ చెబితేనే తాను కస్టమ్స్ కు ఫోన్ చేశానని, ఉద్దేశపూర్వక నేరానికి పాల్పడలేదని ఆమె తెలిపారు. ఆ పార్సిల్ రవాణాకు సంబంధించి ముందు నుంచీ ఏం జరిగిందో పూసగుచ్చినట్లు పిటిషన్ లో వివరించారామె.

ఒక ఫోన్.. మరో మెయిల్ అంతే..
‘‘జూన్ చివరి వారంలో ఈ డ్రామా మొదలైంది. జూన్ 30న దుబాయ్ నుంచి త్రివేండ్రం చేరుకున్న కార్గోలో డిప్లొమాటిక్ బ్యాగేజీల గురించి కనుక్కోమంటూ యూఏఈ కాన్సులేట్ అధికారి రషీద్ నన్ను ఆదేశించారు. ఆ మేరకు జులై 1న కస్టమ్స్ అధికారులకు నేను ఫోన్ చేశాను. దానికి రిప్లైగా.. ‘కార్గో కాంప్లెక్స్ లో ఉన్న బ్యాగులను మీరే వచ్చి తీసుకెళ్లొచ్చు''అని జులై 3న కస్టమ్స్ వాళ్లు మెయిల్ పంపారు. కానీ ఆ వెంటనే సదరు పార్సిల్స్ ను వెనక్కి పంపేయాలని రషీద్ భావించారు. బ్యాగులను తిరిగి ఎక్కడికి పంపాలనే వివరాలను కూడా నా ద్వారానే మెయిల్ పెట్టించారు. చివరికి జులై 5న యూఏఈ కాన్సులేట్ కే చెందిన సరిత్ అనే ఉద్యోగి బ్యాగులు తెచ్చేందుకు వెళ్లి దొరికిపోయాడు. ఇందులో మా పాత్ర నామమాత్రమే..''అని స్వప్న సరేశ్ బెయిల్ పిటిషన్ లో వివరించారు.

మీడియా ట్రయల్స్..
కాగా, గోల్డ్ స్మగ్లింగ్ కేసులో సూత్రధారి అంటూ తన పేరును, ఫొటోలను విపరీతంగా ప్రచారంలోకి తెచ్చిన మీడియాపై స్వప్న సురేశ్ మండిపడ్డారు. తనకు వ్యతిరేకంగా మీడియానే ట్రయల్స్ నిర్వహిస్తున్నదని, తద్వారా తన పరువుకు భంగం వాటిల్లడంతోపాటు అసలు దొంగలు దర్జాగా తప్పించుకునే అవకాశం ఏర్పడుతుందని స్వప్న తన పిటిషన్ లో పేర్కొన్నారు. 2009నాటి సుప్రీంకోర్టు ఆదేశాల అనుసారం మీడియాలో తన పేరును, ఫొటోను వాడకుండా ఉత్తర్వులు ఇవ్వాల్సిందిగా కోర్టును కోరారు. కాగా, స్వప్న వాదనే కరెక్టయితే, రాయబార కార్యాలయం అధికారులు.. మాజీ ఉద్యోగులను వాడుకోవడం కచ్చితంగా తప్పే అవుతుందని నిపుణులు అభిప్రాయపడ్డారు.

కస్టమ్స్ కళ్లుగప్పి..
గోల్డ్ స్మగ్లింగ్ వ్యవహారం బయటపడిన నాటి నుంచి పరారీలో ఉన్న స్వప్న సురేశ్.. కస్టమ్స్ కళ్లుగప్పి హైకోర్టులో పిటిషన్ దాఖ చేయడం గమనార్హం. ఆమెపై కస్టమ్స్ యాక్ట్ లోని సెక్షన్ 104, సెక్షన్ 135 కింద కేసులు నమోదయ్యాయి. విదేశీ వ్యవహారాలు, దేశభద్రతతో ముడిపడిన అంశం కావడంతో కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేను కస్టమ్స్ ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది. దర్యాప్తులో సీబీఐ, ఎన్ఐఏ, రా సాయం కూడా తీసుకుంటామని అధికారులు తెలిపారు.

మోదీ వద్దకు స్వప్న వ్యవహారం..
డిప్లొమాటిక్ బ్యాగేజీలో బంగారం అక్రమరవాణా అనేది దేశ ఆర్థిక రంగానికి, విదేశాల్లో భారత్ ప్రతిష్టకు భంగకరమని, ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకోవాల్సిందిగా కేరళ సీఎం పినరయి విజయన్ బుధవారం ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. యూఏఈ కాన్సులేట్ లో ఉద్యోగం మానేసిన తర్వాత స్వప్న.. ఓ ఏజెన్సీ ద్వారా కేరళ ప్రభుత్వ ఐటీ శాఖ ప్రాజెక్టులో మేనేజర్ గా చేరారు. ఐటీ శాఖను సీఎం పినరయి విజయనే నిర్వహిస్తుండటంతో ఆయనకు తెలిసే స్మగ్లింగ్ జరిగిందని ప్రతిపక్ష పార్టీలు ఆరోపించాయి. క్వాలిఫికేషన్, బ్యాగ్రౌండ్ చెక్ చేయకుండా స్వప్నను ఐటీ శాఖలో తీసుకున్న కారణంగా ప్రిన్సిపల్ సెక్రటరీ శివశంకర్ పై బదిలీ వేటుపడింది. స్వప్న వెనుక బడాబాబులు ఉండొచ్చనే అనుమానాల నేపథ్యంలో ఈ కేసుల రాజకీయంగానూ ప్రకంపనలు పుట్టిస్తోంది.












Click it and Unblock the Notifications