ఎన్నికల వేళ..కేరళ సీఎం మెడకు గోల్డ్ స్మగ్లింగ్ కేసు: అరబిక్ భాషతో లింక్: రూ. కోట్ల కమీషన్
తిరువనంతపురం: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు వ్యవహారం.. అటు తిరిగి, ఇటు తిరిగి. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ మెడకు చుట్టుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలను ఎదుర్కొంటోన్న స్వప్న సురేష్.. స్టేట్మెంట్ తాజాగా కేరళ హైకోర్టు సమక్షానికి చేరింది. దీనికి సంబంధించిన సమగ్ర నివేదిక, అఫిడవిట్ను కస్టమ్స్ అధికారులు హైకోర్టుకు సమర్పించారు. ఇందులో పినరయి విజయన్ పేరును ప్రస్తావించారు. స్వప్నా సురేష్ ఇచ్చిన స్టేట్మెంట్ మేరకు ముఖ్యమంత్రి పేరును రికార్డ్ చేశామని పేర్కొన్నారు.
సీఎం, స్పీకర్ సహా..
పినరయితో పాటు ముగ్గురు మంత్రులు, అసెంబ్లీ స్పీకర్ పీ శ్రీరామకృష్ణన్ ప్రమేయం కూడా ఉన్నట్లు కస్టమ్స్ కమిషనర్ సుమిత్ కుమార్ హైకోర్టు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొన్నారు. ఈ కేసులో స్వప్ప సురేష్ కేవలం మధ్యవర్తి మాత్రమేనని స్పష్టం చేసినట్లు తెలిసింది. పినరయి విజయన్కు అరబిక్ భాష రాకపోవడం వల్ల ఆయన ఆ భాష తెలిసిన స్వప్న సురేష్ సహాయాన్ని తీసుకున్నారని సుమిత్ కుమార్ పేర్కొన్నట్లు చెబుతున్నారు.యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కాన్సులేట్ జనరల్తో నేరుగా మాట్లాడటానికి భాషాపరమైన ఇబ్బందులు రావడం వల్లే స్వప్న సురేష్ జోక్యం చేసుకున్నారని ఈ అఫిడవిట్లో పొందుపరిచినట్లు సమాచారం.
కోట్ల రూపాయల కమీషన్..
ఈ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో ముఖ్యమంత్రి సహా స్పీకర్, ముగ్గురు మంత్రులకు కోట్ల రూపాయల మేర కమిషన్ అందిన విషయాన్ని విచారణ సందర్భంగా స్వప్నా సురేష్ స్పష్టం చేశారని సుమిత్ కుమార్ తన అఫిడవిట్లో స్పష్టం చేసినట్లు కేరళ మీడియా కథనాలను ప్రచురించింది. ముఖ్యమంత్రి మాజీ కార్యదర్శి ఎం శివశంకర్తో తనకు ఉన్న సాన్నిహిత్యం గురించి కూడా స్వప్న సురేష్ తమ విచారణ సందర్భంగా వెల్లడించినట్లు కస్టమ్స్ కమిషనర్ తన అఫిడవిట్లో పేర్కొన్నట్లు తేలింది. ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన ఆయన ప్రస్తుతం బెయిల్పై ఉన్నారు.
కాంగ్రెస్ డిమాండ్..
వచ్చేనెల 6వ తేదీన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగనున్న ప్రస్తుత పరిస్థితుల్లో వెలుగులోకి వచ్చిన ఈ వ్యవహారం.. ప్రస్తుతం కేరళ రాజకీయాల్లో భూకంపాన్ని పుట్టించినట్టయింది. పినరయి విజయన్ సారథ్యంలోని అధికార ఎల్డీఎఫ్ విజయావకాశాలను ఈ వ్యవహారం దెబ్బకొడుతుందనే అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. దీనిపై ప్రతిపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ప్రచారాన్ని కూడా మొదలు పెట్టింది. ఈ ఉదంతంపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలంటూ కాంగ్రెస్ సీనియర్ నేత రమేష్ చెన్నితల డిమాండ్ చేస్తోన్నారు. ముఖ్యమంత్రి, స్పీకర్, మంత్రులు తమ పదవులకు రాజీనామా చేయాలని, రాజకీయాల నుంచి తప్పుకోవాలంటూ ఆయన నినదిస్తోన్నారు.