యాక్టర్ అయితే వీఐపీ ప్రోటోకాల్ ఉంటుందా ? హైకోర్టు సీరియస్..!
సినిమా నటులకు వీఐపీ ప్రోటోకాల్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఏపీతో పాటు దేశవ్యాప్తంగా పలు ఆలయాల్లో దర్శనం కోసం వచ్చే సినీ నటులతో పాటు పలువురు ప్రముఖులకు, సెలబ్రిటీలకు అధికారులు ప్రోటోకాల్ దర్శనాలు ఇప్పించడం చూస్తూనే ఉంటాం. అలాంటిదే ఓ ఘటనపై కేరళ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మలయాళ నటుడు దిలీప్ కు శబరిమల దేవస్దానంలో ఇలా ప్రోటోకాల్ దర్శనం కల్పించడంపై హైకోర్టు మండిపడింది.
తాజాగా శబరిమల ఆలయ దర్శనం కోసం వచ్చిన నటుడు దిలీప్ కు ట్రస్టు బోర్డు అధికారులు సాధారణ భక్తుల్ని ఆపి మరీ వీఐపీ ప్రోటోకాల్ దర్శనం కల్పించడాన్ని సవాల్ చేస్తూ కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. ఆలయ అధికారుల తీరుపై మండిపడింది. సాధారణ భక్తుల్ని ఆపి మరీ నటుడు దిలీప్ కు వీఐపీ దర్శనం కల్పించడం తీవ్రంగా పరిగణించాల్సిన విషయమని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

యాక్టర్ అయితే వీఐపీ ప్రోటోకాల్ ఉంటుందా అని శబరిమల ఆలయ అధికారుల్ని హైకోర్టు ప్రశ్నించింది. అయితే సాధారణ భక్తుల్ని కొన్ని నిమిషాల పాటు మాత్రమే ఆపామని ఆలయం తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీనిపై స్పందించిన హైకోర్టు సోపానం ముందున్న రెండు వరుసల్లో భక్తుల్ని చాలా సేపు ఆపారని సీసీటీవీ ఫుటేజ్ చూసి నిర్ధారణకు వచ్చింది. డిసెంబర్ 5న జరిగిన ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన హైకోర్టు.. ఇలాంటివి మరోసారి జరగకుండా చూసుకోవాలని శబరిమల ఆలయ బోర్డుకు ఆదేశాలు ఇచ్చింది.












Click it and Unblock the Notifications