విద్యార్థిని ప్రాణం తీసిన షావర్మ: 30 మందికి అస్వస్థత: పోలీసుల అదుపులో రెస్టారెంట్ ఓనర్లు
తిరువనంతపురం: షావర్మ.. నాన్ వెజ్ ప్రియులకు అత్యంత ఇష్టమైన ఫుడ్. డిఫరెంట్ టేస్ట్ ఇచ్చే షావర్మను తినడానికి ఇష్టపడని వారుండరు. ఇప్పుడు అదే ఓ విద్యార్థిని ప్రాణం తీసింది. తనకు ఇష్టమైన షావర్మను తిన్న కొద్దిసేపటికే అనారోగ్యానికి గురైన ఓ విద్యార్థిని మృతి చెందింది. మరో 18 మంది అనారోగ్యానికి గురయ్యారు. ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. షావర్మ తయారీలో కుళ్లిన మాంసాన్ని వినియోగించడమే దీనికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. రెస్టారెంట్ ఓనర్లను అరెస్ట్ చేశారు.
కేరళలోని కాసర్గోడ్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతురాలి పేరు దేవనందా. కన్నూర్ జిల్లాలోని కరివెల్లూర్-పేరాళం గ్రామానికి చెందిన విద్యార్థిని. తండ్రి నారాయణన్ మరణించిన తరువాత తల్లి ప్రసన్నతో కలిసి కాసర్గోడ్లోని చెరువథూర్లో నివసిస్తోంది. సాయంత్రం ఆమె తన స్నేహితులతో కలిసి చెరువథూర్లోని ఐడియల్ కూల్ బార్ అండ్ ఫుడ్ పాయింట్కు వెళ్లింది. అక్కడ షావర్మను తిన్నది. ఆ తరువాత వాంతులు, విరేచనాలతో బాధపడింది. ఆమెతో పాటు అక్కడ షావర్మను తిన్న 30 మందికి ఇదే పరిస్థితి తలెత్తింది.
వారందరూ ఒకేసారి చెరువథూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో అడ్మిట్ అయ్యారు. దేవనందా ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆమెను కాసర్గోడ్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మరణించింది. మిగిలిన వారు చెరువథూర్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో చికిత్స పొందుతున్నారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు డాక్టర్ రామ్దాస్ తెలిపారు. కాగా- వారి అనారోగ్యానికి కారణం తెలిసిన వెంటనే చందేలా పోలీసులు ఐడియల్ ఫుడ్ పాయింట్ను సీజ్ చేశారు. ఓనర్లను అదుపులోకి తీసుకున్నారు.
దేవనందా మృతి చెందటం, 30 మంది అనారోగ్యం బారిన పడటం కాసర్గోడ, కన్నూర్ జిల్లాల్లో కలకలం రేపింది. ఈ ఘటనపై కాసర్గోడ్ జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు. ప్రభుత్వం సైతం ఈ ఘటనపై స్పందించింది.
సమగ్ర నివేదిక అందజేయాలంటూ వైద్యారోగ్య మంత్రిత్వ శాఖ- కాసర్గోడ్ జిల్లా కలెక్టర్ను ఆదేశించింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మంత్రి ఎంవీ గోవిందన్ పరామర్శించారు. రాష్ట్రవ్యాప్తంగా నాన్ వెజ్ రెస్టారెంట్లను తనిఖీ చేయడానికి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని అన్నారు.