హీరో దిలీప్ తో కేరళ పోలీసులు సెల్ఫీలు, వైరల్, మమ్ముట్టి, మోహన్ లాల్ ఇలా !
ప్రముఖ నటి కిడ్నాప్, సామూహిక లైంగిక దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టు అయిన మలయాళం హీరో దిలీప్ ను కొచ్చి నగరం సమీపంలోని అలువ సబ్ జైలుకు తరలించారు.
కొచ్చి: ప్రముఖ నటి కిడ్నాప్, సామూహిక లైంగిక దాడి కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టు అయిన మలయాళం హీరో దిలీప్ ను కొచ్చి నగరం సమీపంలోని అలువ సబ్ జైలుకు తరలించారు. హీరో దిలీప్ ను సబ్ జైలుకు తరలించే సమయంలో పోలీసు అధికారులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
నటి కిడ్నాప్, లైంగిక దాడి కేసులో నా పేరు చెప్పకూడదు: రూ. 50 లక్షలు ఇచ్చి టాప్ హీరో !
అలువ సబ్ జైలు దగ్గర విచిత్రమైన సంఘటనలు ఎదురైనాయి. ఎస్కార్ట్ గా వెళ్లిన ఇద్దరు పోలీసులు (యువకులు) కిడ్నాప్, లైంగిక దాడి కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న హీరో దిలీప్ ను మధ్యలో నిలబెట్టి ఇద్దరు పోలీసులు ఇరు వైపుల నిలబడి సెల్ఫీలు తీసుకున్నారు.
సెల్ఫీ సరే పైత్యం ఎందుకు
హీరో దిలీప్ తో సెల్ఫీలు తీసుకున్న పోలీసులు తరువాత ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పోస్టు చేసి వారి పైత్యం చూపించారు. ఆ ఫోటోలు వైరల్ కావడంతో కేరళ పోలీసు అధికారులు సీరియస్ అయ్యారు. సెల్ఫీలు తీసుకున్న ఇద్దరు పోలీసులు మీద కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
జైలు దగ్గర పోలీసులు
అలువ సబ్ జైలు దగ్గర స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున గుమికూడి హీరో దిలీప్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెల్ కమ్ టు సెంట్రల్ జైలు అంటూ స్వాగతం పలికారు. నటి పట్ల తప్పు చేసిన నీకు చివరికి ఇదే గతి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చెయ్యడంతో ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి.
నిజ జీవితంలో అదే జైలుకు
దిలీప్ హీరోగా నటించిన వెల్ కమ్ టు సెంట్రల్ జైలు అనే సినిమా 2016లో విడుదలైయ్యింది. ఆ సినిమాలో దిలీప్ జైలుకు వెళ్లే సన్నివేశాలు ఉన్నాయి. అయితే నిజ జీవితంలో కూడా హీరో దిలీప్ జైలుకు వెళ్లడంతో ఆయనను కేరళ ప్రజలు చీదరించుకుంటున్నారు.
సొంత ఊరిలో ఊహించని సెగ
మరో విషయం ఏమిటంటే దిలీప్ సొంత ఊరు సైతం అలువ ప్రాంతం కావడం విశేషం. అయితే సొంత ఊరిలో ఆయనకు వ్యతిరేకంగా నినాదలు చెయ్యడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జైలు దగ్గర పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.
అంత లేదు, సాదారణ ఖైదీనే
హీరో దిలీప్ కు జైల్లో ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని న్యాయస్థానం ఎలాంటి సూచనలు చెయ్యలేదని, ఆయన్ను మామూలు ఖైదీగానే చూస్తామని జైలు అదికారులు అంటున్నారు. అయితే భద్రతా కారణాల వలన దిలీప్ ను ప్రత్యేక సెల్ లో పెట్టారని మలయాళం మీడియా బుధవారం ఓ కథనం ప్రసారం చేసింది.
పదవులు మొత్తం ఔట్
ది అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (ఎఎంఎంఎ) సభ్యత్వం నుంచి దిలీప్ ను బహిష్కరించామని మంగళవారం ప్రకటించారు. అయితే ఎఎంఎంఎలో దిలీప్ కోశాధికారిగా పని చేస్తున్నారు. ఆ పదవి నుంచి కూడా దిలీప్ ను తప్పించామని మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి కొచ్చిలో స్థానిక మీడియాకు చెప్పారు.
ఆమె మా సోదరి, ఏం కష్టం వచ్చినా !
కిడ్నాప్, లైంగిక దాడికి గురైన నటి మాకు సోదరిలాంటిదని, ఆమెకు ఏం కష్టం వచ్చినా ఆదుకోవడానికి తాము సిద్దంగా ఉన్నామని మలయాళం మెగాస్టార్ మమ్ముట్టి, సూపర్ స్టార్ మోహన్ లాల్ స్థానిక మీడియాకు చెప్పారు. ఆమెను అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
ఆమె మీద ఎక్కడ ఫిర్యాదు లేదు
మలయాళంతో సహ తెలుగు, తమిళ, కన్నడ బాషా చిత్రాల్లో నటించిన ఆ నటి మీద ఇంత వరకూ ఎక్కడా ఎలాంటి ఫిర్యాదులు లేవని ఇదే సమయంలో మమ్ముట్టి, మోహన్ లాల్ గుర్తు చేశారు. అందుకే ఎఎంఎంఎ ఆ నటికి అండగా ఉండాలని నిర్ణయం తీసుకున్నామని మమ్ముట్టి, మోహన్ లాల్ చెప్పారు.
సీఎంతో మాట్లాడుతాం !
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తిరువనంతపురంలో ఉన్నారని, ఆయన కొచ్చి వచ్చిన వెంటనే మాట్లాడి నటికి ప్రభుత్వం తరపున న్యాయ సహాయం చెయ్యాలని మనవి చేస్తామని మమ్ముట్టి, మోహన్ లాల్ అన్నారు. ప్రభుత్వం తరపున బాధితురాలికి పూర్తి సహకారం ఇప్పించడానికి ప్రయత్నిస్తామని అన్నారు.
ఎంపీ, ఎమ్మెల్యేలు
ఎఎంఎంఎ అధ్యక్షుడు, ఎంపీ ఇన్నోసెంట్, అధికారంలో ఉన్న ఎల్ డీఎఫ్ ఎమ్మెల్యేలు, మలయాళం నటులు ముఖేష్, కే.బి. గుణశేఖర్ సైతం నటికి పూర్తి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అయితే ఎంపీ, ఎఎంఎంఎ అధ్యక్షుడు ఇన్నోసెంట్ ఇటీవల హీరోయిన్ల విషయంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసి విమర్శలపాలైన విషయం తెలిసిందే.