నా కుక్కలను కాపాడండి...లేదంటే నేను ఇక్కడే చస్తాను: సహాయక బృందంతో కేరళ మహిళ
కేరళ: ఏదైనా విపత్తు జరిగితే ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు తీస్తాం. మన కుటుంబ సభ్యులను కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. ఆస్తులన్నీ అక్కడే వదిలేసి ముందుగా ప్రాణాలు కాపాడుకునేందుకే తాపత్రయ పడతాం. ఎందుకంటే ప్రాణాలతో మిగిలితే ఆ ఆస్తి తర్వాతైన సంపాదించుకుంటామనే నమ్మకం ఉంటుంది. ఇలా ఆస్తులన్నీ వదిలేసుకుని కేవలం ప్రాణాలను కాపాడుకునే క్రమంలో మరొకరిని మరిచిపోతాం. అదే మనతో పాటు మన కుటుంబంలో ఒకరిగా ఉంటూ, ఎల్లవేళల రక్షణగా నిలిచే పెంపుడు జంతువులు. వీటిని మరిచి పోతూ ఉంటాం. కానీ కేరళ వరదల్లో చిక్కుకున్న ఓ కుటుంబం మాత్రం తమ పెంపుడు కుక్కలను వదిలి రామని భీష్మించుకు కూర్చున్నారు. ఒకటి అయితే కాపాడొచ్చు.. కానీ వారికి 25 పెంపుడు కుక్కలున్నాయి.
కొన్నేళ్ల క్రితం కత్రినా తుఫాను ఎలాంటి బీభత్సాన్ని సృష్టించిందో తెలిసిందే. ఆసమయంలో చెట్టుకొకరు పుట్టకొకరుగా మిగిలారు. అంతేకాదు పెంపుడు జంతువులు కొట్టుకుపోయాయి. ప్రస్తుతం అదే పరిస్థితి కేరళలో కనిపిస్తోంది. వరదల ధాటికి కేరళ కకావికలం అయ్యింది. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే ఓ మహిళ ఇంటికి ఎన్డీఆర్ఎఫ్ బృందం వెళ్లింది. మహిళను బయటకు రావాల్సిందిగా వారు కోరారు. కానీ ఆ మహిళ మాత్రం తాను అక్కడే చావనైనా చస్తాను కానీ తన 25 కుక్కలను వదిలి రానని వారికి తెగేసి చెప్పేసింది. ఏంటి పిచ్చా నీకు... వరదలు ఇంటిని ముంచేస్తాయి అని సహాయక సిబ్బంది గట్టిగా కేకలు వేసినప్పటికీ ఆ మహిళ మాత్రం కదల్లేదు.
ఇక చేసేదేమీలేక ముందుగా ఆ పెంపుడు కుక్కలను కాపాడేందుకు సిద్ధమైంది రెస్క్యూ టీమ్. ఇంటిలోకి అప్పటికే నీరు వచ్చి చేరింది. కుక్కలకోసం వెతికారు. ముందు అవి కనపడలేదు. నీటిలో మునిగి ఉంటాయేమో అని భావించారు. కానీ అవి ఒక మూలన ఎత్తులో ఉండే పరుపులపై నక్కి ఉన్నాయి. వెంటనే ఆ కుక్కలను కాపాడింది రెస్క్యూ సిబ్బంది. కుక్కలను తాము కాపాడలేమని చెప్పడంతో తమను ఆ మహిళ వెనక్కు పంపిందని ఓ సహాయక సిబ్బంది తెలిపారు. ఇక మంకు పట్టు పట్టడంతో కుక్కలను బయటకు తీసుకొచ్చామని వారు వెల్లడించారు. మహిళను, తన భర్తతో పాటు తాము పెంచుకుంటున్న 25 కుక్కలను కాపాడినట్లు సహాయక సిబ్బంది తెలిపింది. కుక్కలతో పాటు మహిళ ఆమె భర్త సహాయక శిబిరాల్లో సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు.