కుప్పిగంతులు వద్దు: రజనీకాంత్కు ఖుష్బూ మళ్లీ చురకలు
చెన్నై: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్పై కాంగ్రెసు నాయకురాలు, సినీ నటి ఖుష్బూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలంటే బ్లాక్ బస్టర్ సినిమాలు కాదని ఆమె రజనీకాంత్కు చురకలు అంటించారు. ప్రజలకు సేవ చేయాలని ఉంటే రాజకీయాల్లోకి రావాలని ఆమె రజనీకాంత్కు సూచించారు. అంతేగానీ కాసేపు వస్తాను, మరికాసేపు రానంటూ కుప్పిగంతలు వేయడం సరి కాదని ఆమె అన్నారు.
ఖుష్బూ శనివారం మీడియాతో మాట్లాడారు. తమిళనాడులో కాంగ్రెసు పార్టీని క్షేత్ర స్థాయి నుంచి బాగు చేయాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. ఆ బాధ్యతను కాంగ్రెసు అధిష్టానం తకు అప్పగించిందని చెప్పారు. ఆమె రెండు రోజుల క్రితం డిఎంకెకు రాజీనామా చేసి, పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెసు పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఖుష్బూ బిజెపిలో చేరుతారని గతంలో ప్రచారం సాగింది. అయితే, కాంగ్రెసులో చేరడంతో ఆ ప్రచారానికి తెర పడింది.
రజనీకాంత్ పక్కన నటించబోనని ఇంతకు ముందు ఖుష్బూ ప్రకటించారు. అయితే, కమల్ హాసన్ సరసన నటించడానికి తనకు అభ్యంతరం లేదని చెప్పారు. సోషల్ నెట్వర్కింగ్ సైట్లో అభిమానులతో తన అభిప్రాయాలను పంచకుంటూ ఆమె ఆ విధంగా అన్నారు. రాజకీయ కారణాల వల్లనే ఆమె ఈ ప్రకటన చేశారని భావించారు. రజనీకాంత్ ఇటీవల దైవం కోరుకుంటే తాను రాజకీయాల్లోకి వస్తానని రజనీకాంత్ ఇటీవల అన్నారు.
కాంగ్రెసులో చేరిన తర్వాత తాను సొంత ఇంటికి వచ్చినట్లు ఉందని కూడా ఖుష్బూ వ్యాఖ్యానించారు. డీఎంకే పార్టీ పైన నిప్పులు చెరిగారు. తనకు ఆ పార్టీ తగిన గుర్తింపు ఇవ్వలేదన్నారు. తమ కుటుంబ సభ్యులు మొదటి నుండి కాంగ్రెస్ అభిమానులే అన్నారు.